ఏడ్చింది నిజమే కానీ తప్పుగా అర్థం చేసుకున్నారు: కుమారస్వామి ట్విస్ట్
కర్ణాటక: రెండు రోజుల క్రితం పార్టీ కార్యక్రమంలో కంటతడి పెట్టిన అంశంపై జేడీఎస్ అధినేత, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మంగళవారం స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పలేదని తాజాగా వెల్లడించారు. తాను ఏడ్చిన మాట వాస్తవమేనని, కానీ పొత్తు విషయానికి సంబంధం లేదని చెప్పారు.
చదవండి: సంతోషంగా లేను, దేవుడి దయ.. ఎన్ని రోజులు ఉంటానో: కుమారస్వామి కంటతడి
తాను కంటతడి పెట్టిన మాట నిజమే కానీ మీడియా తప్పుగా అర్థం చేసుకుందని చెప్పారు. తాను కాంగ్రెస్ గురించి కానీ కాంగ్రెస్ నేతల గురించి కానీ ఎప్పుడూ, ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. పార్టీ కార్యక్రమంలో భాగంగా తాను ఎందుకో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. కానీ మీడియా తన ప్రసంగాన్ని తప్పుగా ప్రస్తావించిందన్నారు.
అధికార పీఠం దక్కినా తాను ఏమాత్రం సంతోషంగా లేనని కుమారస్వామి రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. శనివారం బెంగళూరులో ఏర్పాటుచేసిన ఓ సన్మాన కార్యక్రమంలో తన ఆవేదన వెళ్లగక్కుతూ కంటతడి పెట్టారు.
తాను సీఎం కుర్చీలో కూర్చోవడం జనతాదళ్ కార్యకర్తలకు మాత్రమే సంతోషమని, తాను మాత్రం విషం మింగుతున్నానని, రైతుల కష్టాలు తీర్చాలన్న లక్ష్యంతో కష్టమైనా రుణమాఫీ ప్రకటించానని, ఆర్థికంగా పెనుభారమైన ఈ పథకానికి డబ్బులు ఎక్కడ నుంచి తేవాలని, ఈ పరిస్థితుల్లోనే పన్నుల భారాన్ని మోపానని, తన పరిస్థితి గరళాన్ని మింగిన శివుడిలా మారిందన్నారు.