సీఎం పదవికి రాజీనామా చేసే ముందు కుమారస్వామి బంపర్ ఆఫర్, ప్రైవేట్ రుణాలు మాఫీ !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ముందు హెచ్.డి. కుమారస్వామి (ప్రస్తుతం అపద్దర్మ ముఖ్యమంత్రి) కర్ణాటకలోని పేదలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కర్ణాటకలోని పేద ప్రజలు తీసుకున్న పలు రకాల ప్రైవేట్ రుణాలు అన్నీ మాఫీ కావడానికి ప్రత్యేక చట్టం అమలు చేశారు. నియమాల ప్రకారం రుణాలు ఇచ్చిన సంబంధిత వ్యక్తులు, సంస్థలకు ప్రభుత్వం నగదు బదిలీ చేస్తుందని కుమారస్వామి వివరించారు.
కుమారస్వామి హామీలు
మంగళవారం కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం కుమారస్వామి అపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీఎం పదవికి రాజీనామా చెయ్యకమందే కుమారస్వామి ప్రత్యేక రుణమాఫి చట్టం అమలు చేశారు. ఈ విషయంపై కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. గత సంవత్సరం నుంచి ఈ ప్రత్యేక రుణమాఫీ చట్టం అమలు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కుమారస్వామి వివరించారు.
రాష్ట్రపతి సంతకం
తనకు ముఖ్యమంత్రి పదవి చెయ్యిజారిపోయినా చివరి రోజు పేదలకు సహాయం చేసే రుణమాఫీ చట్టం తీసుకువచ్చి అమలు చేశాననే సంతోషం మిగిలిందని కుమారస్వామి అన్నారు. తాను తీసుకు వచ్చిన రుణమాఫీ చట్టం పేదలకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని కుమారస్వామి చెప్పారు. ఈ చట్టం అమలు కావడానికి అవకాశం ఇచ్చి సంతకం చేసిన రాష్ట్రపతికి పత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నానని కుమారస్వామి అన్నారు.
ఇలాంటి రుణాలు మాఫీ
బ్యాంకు రుణాలు మినహాయించి ప్రైవేటు వ్యక్తులు దగ్గర తీసుకున్న అన్ని రకాల లావాదేవీలు, బంగారం కుదవ పెట్టి (గోల్డ్ లోన్లు) ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకున్న బంగారు లోన్లు, భూముల పత్రాలు కుదవ పెట్టి తీసుకున్న రుణాలు మొత్తం మాఫీ చెయ్యడానికి ఈ రుణమాఫీ చట్టం ఎంతో ఉపయోగపడుతోందని కుమారస్వామి వివరించారు.
ఆర్ బీఐ అనుమతి
భూమి లేని పేదలు, రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు, వార్షిక ఆదాయం రూ. 1.20 లక్షలు తక్కువ ఆదాయం ఉన్న పేదలు ప్రైవేటు వ్యక్తులు, ఫైనాన్స్ సంస్థలు (బ్యాంకు రుణాలు కాకుండా) దగ్గర తీసుకున్న అన్ని రుణాలు మాఫీ అవుతాయని అపద్దర్మ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. ఆర్ బీఐ అనుమతి తీసుకుని రుణాలు ఇచ్చిన వ్యాపారులకు, సంస్థలకు ఈ ప్రత్యేక రుణమాఫీ చట్టం వర్తించదని కుమారస్వామి చెప్పారు.
రాష్ట్రపతి ఆమోదం
సోమవారం ఈ కొత్త రుణమాఫీ చట్టం అమలు చేశామని కుమారస్వామి వివరించారు. 90 రోజుల్లోపు సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో సంప్రదించాలని, లేదంటే అర్జీలు సమర్పించాలని కుమారస్వామి తెలిపారు. సీఎంగా చివరి రోజు పేద ప్రజల కోసం పని చేశాను అనే సంతృప్తి తనకు ఉందని, ఈ చట్టం అమలు కావడానికి అవకాశం ఇచ్చి సంతకం చేసిన రాష్ట్రపతికి ధన్యవాదాలు చెబుతున్నానని కుమారస్వామి అన్నారు.