హైడ్రామా: రాజ్ భవన్ ఎదుట కుమారస్వామి, ఎమ్మెల్యేల నిరీక్షణ, సెక్యూరిటీతో వాగ్వాదం
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టక పోవడంతో హైడ్రామా కొనసాగుతోంది. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం ఐదు గంటలకు రాజ్ భవన్ వచ్చారు. వారు ప్రత్యేక బస్సుల్లో రాజ్ భవన్ వచ్చారు. అయితే వారికి గవర్నర్ నుంచి పిలుపు రాలేదు. దీంతో రాజ్ భవన్ ఎదుటే వారు నిరీక్షిస్తున్నారు.
మేమంతా ఒక్కటి: బీజేపీకి రేవణ్ణ షాక్, బీజేపీ రూ.100 కోట్ల ఆఫర్ చేసింది, గవర్నర్ వద్దకు కుమారస్వామి
వారిని రాజ్ భవన్ సిబ్బంది లోనికి అనుమతించలేదు. కుమారస్వామితో సహా ఎమ్మెల్యేలను ఎవరినీ లోనికి అనుమతించలేదు. గేటు బయట గవర్నర్ పిలుపు కోసం వారు వేచి చూస్తున్నారు. భద్రతా సిబ్బందితో కుమారస్వామి, ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. తన ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ఎదుట పరేడ్ చేయాలని కుమారస్వామి భావిస్తున్నారు. గవర్నర్ తమను లోపలకు అనుమతించకపోవడంతో ఎమ్మెల్యేలు బయట ధర్నాకు దిగారు. గవర్నర్ ఎదుట పరేడ్కు అనుమతి నిరాకరించారు. అయితే, ఆ తర్వాత కుమారస్వామి, కాంగ్రెస్ నేత పరమేశ్వర గవర్నర్ను కలిశారు.
రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం బీజేపీకి మొదటి అవకాశం
కర్ణాటకలో హంగ్ ఏర్పడటంతో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. మెజార్టీకి సమీపంలో వచ్చి ఆగిపోయిన బీజేపీకి రాజ్యాంగ సంప్రదాయాలను అనుసరించి ప్రభుత్వ ఏర్పాటుకు మొదట అవకాశమివ్వాలి. అయితే కాంగ్రెస్, జేడీఎస్లు తమకు మెజార్టీ ఉందని తమకే అవకాశమివ్వాలని చెబుతున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలకు తమ వైపునకు తిప్పుకునేందుకు ఆపరేషన్ కమల ద్వారా బీజేపీ యత్నిస్తోందని జేడీఎస్నేత కుమారస్వామి ఆరోపించారు.
అప్పుడు ఏం జరిగిందంటే?
2008 ఎన్నికల అనంతరం బీజేపీ అధికారంలోకి వచ్చింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 110 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత ఆయన ఆపరేషన్ కమలం ప్రారంభించారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 20 మందితో రాజీనామా చేయించారు. దీంతో విపక్ష సభ్యల సంఖ్య తగ్గింది. అప్పుడు బీజేపీకి మెజార్టీ వచ్చింది.
అలా చేస్తే యడ్యూరప్ప నెగ్గుతారు
ఆ తర్వాత రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికల్లో పోటీ చేయించారు. అనేకమంది ఇలా తిరిగి ఎన్నిక కావడంతో బీజేపీ మెజార్టీకి అవసరమైన సభ్యుల మద్దతు లభించింది. నాడు యడ్యూరప్ప అలా పైచేయి సాధించారు. ఇప్పుడు బీజేపీ 104 స్థానాలు గెలుచుకుంది. విపక్షాల నుంచి ఎనిమిది మంది సభ్యులు హాజరు కాకుండా చేస్తే ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గుతుంది.
మొదట బీజేపీని మోసం చేసింది జేడీఎస్ అని బీజేపీ
పదేళ్ల క్రితంలా ఆపరేషన్ కమలంను ప్రయోగిస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని జేడీఎస్ అధినేత కుమారస్వామి హెచ్చరించారు. బీజేపీ సభ్యులు కూడా అనేకమంది తమ కూటమిలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే, నాటి ఆపరేషన్ను బీజేపీ సమర్థించుకుంది. ఎందుకంటే అంతకుముందు జేడీఎస్ - బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఒప్పందం ప్రకారం మొదట కుమారస్వామి, తదుపరి యడ్యూరప్ప సీఎంగా ఉండాలి. నాడు ఒప్పందాన్ని జేడీఎస్ ఉల్లంఘించింది. బీజేపీని మోసం చేసింది. దీనికి ప్రతీకారంగా 2008లో ఆపరేషన్ కమలం చేపట్టారు. ఇప్పుడు మరోసారి ఆ తరహా రాజకీయానికి తెరలేపింది.