సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం, బీజేపీ లీడర్స్ డిసైడ్, వీవీఐపీలు హాజరు, హైకమాండ్!
బెంగళూరు: జేడీఎస్-కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి జేడీఎస్ నేత హెచ్.డి. కుమారస్వామి సిద్దం అయ్యారు. హైకమాండ్ ఆదేశాల మేరకు బీజేపీ కర్ణాటక నాయకులు ఓ నిర్ణయం తీసుకున్నారు.
వీవీఐపీలు హాజరు
కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి దేశంలోని వివిద రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు అనేక పార్టీల అధినేతలు హాజరౌతున్నారు. కర్ణాటకలోని బీజేపీ నాయకులు కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావడం అనుమానంగానే ఉంది.
యడ్యూరప్ప క్లారిటీ
కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి మీరు హాజరు అవుతారా అంటూ మంగళవారం బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్, యడ్యూరప్పను మీడియా ప్రశ్నించింది. హైకమాండ్ చెప్పినట్లు తాము నడుచుకుంటామని బీఎస్. యడ్యూరప్ప అన్నారు.
సామూహిక బహిష్కరణ
బుధవారం జరిగే కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి కర్ణాటకలోని బీజేపీ నాయకులే కాదు ఒక్క కార్యకర్త కూడా హాజరుకారని బీఎస్. యడ్యూరప్ప స్పష్టం చేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మూడురోజుల్లో బీఎస్. యడ్యూరప్ప రాజీనామా చెయ్యడానికి కాంగ్రెస్, జేడీఎస్ కారణం అయిన విషయం తెలిసిందే.
ఆహ్వానించారా!
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న హెచ్.డి. కుమారస్వామి కార్యక్రమానికి హాజరుకావాలని దేశంలోని ప్రముఖులను ఆయనే స్వయంగా ఆహ్వానించారు. అయితే బీఎస్. యడ్యూరప్పతో పాటు కర్ణాటకలోని బీజేపీ నాయకులను కుమారస్వామి కార్యక్రమానికి ఆహ్వానించారా, లేదా అనే విషయం తెలియడం లేదు.