బలపరీక్షలో ఓడిన కాంగ్రెస్-జేడిఎస్ ,అనుకూలం 99 ,వ్యతిరేకం 105
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పడిపోయింది.
కర్ణాటక అసంబ్లీలో ఉత్కంఠకు తెరపడింది. సాయంత్రం సుమారు గంటపాటు సీఎం కుమారస్వామి ప్రసంగం తర్వాత స్పికర్ రమేష్ సాయంత్రం 7.20 నిమిషాలకు అసెంబ్లీ తలుపులు మూసి సభ్యులను డివిజన్ పద్దతిన లెక్కించాడు. ఈనేపథ్యంలోనే సుమారు 15 నిమిషాలపాటు సభ్యులను లెక్కించారు. ముందుగా కాంగ్రెస్,జేడీఎస్ సభ్యులను లెక్కించగా అనంతరం బీజేపీ సభ్యులను హజరును లెక్కించారు. సభలో ఒక్కోక్కరు వరస సంఖ్యలో నిలబడడంతో స్పికర్ ఆ సంఖ్యను కౌంట్ చేయించారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కు చెందిన 12 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు.. జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి సభకు హజరు కాకుండా దూరంగా ఉన్నారు. అలాగే, కాంగ్రెస్కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అనారోగ్య కారణాలతో సభకు దూరమయ్యారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సభకు దూరంగా ఉండటంతోపాటు బీఎస్పీ ఎమ్మెల్యే సైతం సభకు దూరంగా ఉన్నారు. దీంతో అధికార పక్షానికి తగిన సంఖ్యాబలం లేని కారణంగా కుమార సర్కార్ మైనార్టీలో పడిపోయింది.