బళ్లారి శ్రీరాములు సవాల్ కు కుమారస్వామి ప్రతి సవాల్, ఎవరి తరం కాదు, మాదే ప్రభుత్వం !
బెంగళూరు: తనకు నిద్రరాకుండా చెయ్యడం ఎవరితరం కాదని, బళ్లారి శ్రీరాములు లాంటి వ్యక్తులకు అది ఏమాత్రం సాధ్యంకాదని, అధికారం రాలేదని బీజేపీ నాయకులకే ఇప్పుడు నిద్రపట్టడం లేదని కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మండిపడ్డారు. బళ్లారి శ్రీరాములు సవాలుకు కుమారస్వామి పత్రి సవాలు విసిరారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన కుమారస్వామి బీజేపీ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
మాటలు చాలు
తనకు, కాంగ్రెస్ నాయకులకు నిద్రలేకుండా చేస్తామని బీజేపీ నాయకులు మాటలు చెబుతున్నారని హెచ్.డి. కుమారస్వామి విమర్శించారు. మొదట బీజేపీ నాయకులు ప్రశాంతంగా నిద్రపోతే వారి ఆరోగ్యానికి మంచిదని హెచ్.డి.కుమారస్వామి సూచించారు.
ఐదేళ్లు సంకీర్ణ ప్రభుత్వం
అందరి విశ్వాసం పరిగణలోకి తీసుకుని కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తామని హెచ్.డి. కుమారస్వామి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సలహాలు, సూచనలు తీసుకుని కర్ణాటకలో ఐదు సంవత్సరాలు సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.
సీఎంగా పని చేశా
గతంలో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా తాను శక్తివంచన లేకుండా పని చేశానని కుమారస్వామి గుర్తు చేశారు. ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తాననే నమ్మకం తనకు ఉందని. ఆ దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చారని కుమారస్వామి అన్నారు.
శ్రీరాములు వార్నింగ్
బీజేపీ ఓడిపోయిందని కాంగ్రెస్, జేడీఎస్ అనుకుంటోందని, వారిని తాము వదిలిపెట్టమని ఆదివారం బళ్లారిలో కర్ణాటక మాజీ మంత్రి బి. శ్రీరాములు అన్నారు. ప్రతిరోజూ 24 గంటలు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులను వెంటాడి కంటిమీద కునుకులేకుండా చేస్తామని శ్రీరాములు హెచ్చరించారు.
స్వార్థ రాజకీయం
కర్ణాటక ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, జేడీఎస్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసున్నాయని, ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారని, ఆ అవకాశం వారికి ఇవ్వమని, వారి అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువచ్చి వారి అసలు బండారం బయటపెడుతామని శ్రీరాములు హెచ్చరించారు. శ్రీరాములు సవాలుకు సోమవారం హెచ్.డి. కుమారస్వామి కౌంటర్ ఇచ్చారు.