యడ్యూరప్ప ప్రసంగం: అడ్డుపడ్డ సిద్ధు, నిద్రలో రేవణ్ణ
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న బలనిరూపణ పరీక్షపై దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తుంటే.. జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి సోదరుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవణ్ణ నిద్రపోయారు. అసెంబ్లీలో శనివారం సాయంత్రం 4గంటలకు సీఎం యడ్యూరప్ప విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
అనంతరం ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఓ వైపు ఆయన ప్రసంగం కొనసాగిస్తున్నప్పటికీ.. రేవణ్ణ మాత్రం నిద్రలోకి జారుకున్నారు. అంతకుముందు శనివారం ఉదయం జరిగిన సమావేశంలో మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా కునుకుపాట్లు తీయడం గమనార్హం.
కాగా, మొదట సీఎం యడ్యూరప్ప తన ప్రసంగాన్ని ప్రారంభించగా.. ప్రసంగానికి ముందే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మాజీ సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. దీంతో యడ్యూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఆ తర్వాత యడ్యూరప్ప భావోద్వేగంగా ప్రసంగం చేశారు. చివరకు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం సాయంత్రం ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్కు అందించనున్నారు.