ఇక ఉచితమే: హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు తీపి కబురు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తమ ఖాతాదారులకు తీపికబురును అందించింది. ఇకపై ఆన్లైన్లో ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా జరిపే లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది. ఇకపై ఈ సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.
ఉచిత సేవలే..
నవంబర్ 1 నుంచి ఉచితంగా ఈ(ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా జరిపే) సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ తెలిపింది.
ఎలాంటి రుసుమూ లేదు..
సవరించిన ఛార్జీల ప్రకారం సేవింగ్స్, శాలరీ ఖాతాలు కలిగిన ఖాతాదారులు ఇకపై రియల్ టైమ్ గ్రాస్ సెటిలిమెంట్ (ఆర్టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ఈఎఫ్టీ) ద్వారా చేసే ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
అంతకుముందు ఇలా..
కాగా, అంతకుముందు ఆర్టీజీఎస్ ద్వారా రూ.2-5 లక్షల మధ్య చేసే లావాదేవీలకు రూ.25, రూ.5లక్షల పైబడి మొత్తంపై రూ.50 చొప్పున రుసుముగా వసూలు చేసేవారు. అలాగే, ఎన్ఈఎఫ్టీ ద్వారా రూ.10వేలు లోపు లావాదేవీలపై రూ.2.5, రూ.10వేలు నుంచి రూ.లక్ష మధ్య రూ.5, రూ.1-2 లక్షల మధ్య రూ. 15, రూ.2లక్షలకు పైబడి మొత్తాలపై రూ.25 చొప్పున రుసుముగా వసూలు చేసేవారు.
చెక్ బుక్ మాత్రం ఒకటే..
అయితే, ఒకవేళ ఇవే తరహా లావాదేవీలను బ్యాంక్ శాఖలో జరిపితే మాత్రం రుసుము వసూలు చేస్తారు. ఇది ఇలావుంటే.. ఇప్పటి వరకు 25 పత్రాలు ఉన్న చెక్బుక్లను ఏడాదికి రెండు ఇచ్చేవారు. ఇకపై ఒకదానికే పరిమితం చేయనున్నారు. రెండో చెక్బుక్ కావాలంటే రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతాలో తగిన మొత్తం లేక వెనక్కి వచ్చే చెక్కులపై రూ.500 పెనాల్టీగా వసూలు చేయనున్నట్లు బ్యాంక్ పేర్కొంది.