ఎఫైర్: భార్యకు చెబుతుందని ప్రియురాలి హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి ఎక్కడ భార్యకు చెబుతుందోనని భావించిన ఓ దుర్మార్గుడు తన ప్రియురాలిని దారుణంగా కొట్టిచంపాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ కుమార్(32) హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు పెళ్లి కాలేదని నమ్మించి బ్యాంకులో సహోద్యోగిగా పనిచేస్తున్న పుణ్య సాగర్(28)తో గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నాడు.
అయితే నవీన్కు అప్పటికే పెళ్లయిపోయిందని, అతనికి పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకున్న పుణ్య సాగర్.. తమ వివాహేతర సంబంధాన్ని గురించి భార్యకు చెబుతానని బెదిరించింది. దీంతో ఆందోళనకు గురైన నవీన్.. బయటకు తీసుకెళ్తానని నమ్మించి పుణ్య సాగర్ను కారులో నగర శివార్లకు తీసుకెళ్లి దారుణంగా చంపేశాడు.
నవీన్.. ఆమె తలను ఫుట్ పాత్కు బలంగా కొట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నవీన్ కుమార్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.