ఆ ఇద్దరిపైనే కాంగ్రెస్ సమ్మకాలు..! బాద్యతలు మోసేది మాత్రం ఆయనే..!!
ఢిల్లీ/హైదరాబాద్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీని ఆదుకునేది ఎవరనే అంశంపై సర్వత్రా వాడి వేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అద్యక్ష పదవిని ప్రియాంక గాంధీ సున్నితంగా తిరస్కరిస్తుండడంతో తర్వాత తర్వత బాద్యతలు ఎవరికి కట్ట బెట్టాలా అని కాంగ్రెస్ అదిష్టానం కసరత్తు చేస్తోంది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతున్న వేళ ఆ పార్టీలో ఉత్సాహం నింపి పరుగులు పెట్టించే సారథి లేకుండా పోయారు. మొన్నటికి మొన్న కర్ణాటకలో ఉన్న కూటమి సర్కారు కూడా పడిపోయింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్కు సారథ్యం అనివార్యమైంది. సార్వత్రిక ఎన్నికల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది.
ఇదిలా ఉండగా ఈ ఏడాదే రాజకీయ ప్రవేశం చేసిన ప్రియాంక పార్టీ బాధ్యతలు చేపట్టాలని సీనియర్లు ఒత్తిడి చేస్తున్నా ఇందుకు ఆమె ససేమిరా అంటున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి సైతం ఇదే మాట చెప్పారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.
ప్రియాంక కొందరు కాంగ్రెస్ నేతల పేర్లు సూచించినట్లు తెలుస్తోంది. గతేడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో పట్టు నిలుపుకొంది. ఆయా రాష్ట్రాల్లో యువనేతలకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది. అయితే ఇప్పుడు పార్టీని నడపడానికి యువనేతలైతే బాగుంటుందని భావించి సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. వీరు కాకుండా సీనియర్లలో మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్, కుమారీ సెల్జా, ముకుల్ వాస్నిక్, సుశీల్ కుమార్ షిండేలు కూడా రేసులో ఉన్నారు.