దళితుల ఆశాదీపం: ఎవరీ జిగ్నేష్ మేవానీ?
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో దళితుల సమస్యలపై పోరాటం చేసే యోధుడిగా జిగ్నేష్ మేవానీపై దళితులు విశ్వాసంతో ఉన్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన 18 నెలల్లోనే జిగ్నేష్ మేవానీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గుజరాత్ రాష్ట్రంలో బిజెపికి ముప్పుతిప్పలు పెట్టిన ముగ్గురు యువకుల్లో జిగ్నేష్ మేవానీ కూడ ఒకరు.
Recommended Video
గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి బిజెపికి సీట్లు తగ్గడానికి ముగ్గురు యువకలు కీలకంగా వ్యవహరించారు. అయితే ఓట్ల చీలికతో పాటు ఇతర అంశాలు బిజెపికి కలిసివచ్చాయి.
గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించింది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రూరల్ సీట్లలో విజయం సాధించింది.
ఎవరీ జిగ్నేష్ మేవానీ
1982 డిసెంబర్ 11వ,తేదిన జిగ్నేష్ మేవానీ జన్మించారు. బిఎ వరకు చదివారు.. అభ్యాన్ అనే గుజరాత్ మేగజైన్కు జిగ్నేష్ కొంత కాలం పాటు జర్నలిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు న్యాయవాద వృత్తిని కూడ కొనసాగించారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ముగ్గురు యువకుల్లో జిగ్నేష్ మేవానీ ఒకరుగా నిలిచారు. దళితుల సమస్యలపై జిగ్నేష్ మేవానీ పెద్ద ఎత్తున ఆందోళనలు సాగించారు.
గుజరాత్ రాజకీయాల్లోకి జిగ్నేష్ ఇలా
ఉనాలో ఓ చనిపోయిన ఆవు ఛర్మాన్ని వలుస్తుంటే నలుగురు దళిత యువకులపై అగ్రవర్ణాలకు చెందిన యువకులు దాడిచేసి దారుణంగా హింసించారు. ఆ సంఘటనతో కదిలిపోయిన మేవాని, దళిత యువకులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దళితుల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకొని ‘ఉనా దళిత్ అత్యాచార్ లడత్' సమితిని ఏర్పాటు చేశారు. దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఆయన ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ముందుకెళుతున్నారు.2016, జూలై నెలలోనే మేవాని రాజకీయ రంగంలోకి ప్రవేశించారు.
స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి
బనస్కాంత జిల్లా వడ్గామ్ అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జిగ్నేష్ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిగ్నేష్కు మద్దతును ప్రకటించింది. జిగ్నేష్ ఈ నియోజకవర్గం నుండి 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు . దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఆయన ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ముందుకెళుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు
ఉనా సంఘటనపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేయలేదని హక్కుల సంఘాల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.. కేసులో నిందితులను అరెస్ట్చేసి బెయిల్పై విడుదల చేశారు. మేవానీతోపాటు దసడ, దారిలింమ్డా, కోడినార్, కలవడ్, గధడ అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి కూడా దళితులు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. గత అసెంబ్లీలో కాంగ్రెస్, స్వతంత్య్ర అభ్యర్థులుగా ముగ్గురు దళితులు విజయం సాధించగా ఈసారి ఆరుగురు దళితులు విజయం సాధించారు.
దళితుల గొంతు విన్పిస్తారని ఆశ
రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యావంతుడైన మేవానీ తప్పకుండా అసెంబ్లీ ముందుకు తీసుకెళతారనే విశ్వాసం తమకు పూర్తిగా ఉందని సురేంద్రనగర్ జిల్లా దళిత నాయకుడు నాథూభాయ్ పార్మర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేవాని విజయం ఇతర సామాజిక కార్యకర్తలకు స్ఫూర్తినిస్తుందని, వారు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుత వ్యవస్థను మార్చేందుకు కృషి చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు