నటి శశిరేఖ హత్య: ప్రేయసితో కలిసి భర్తనే చంపేశాడు
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన కోలీవుడ్ నటి శశిరేఖ హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. భర్తనే తన ప్రేయసి సహకారంతో చంపేసినట్టు విచారణలో వెల్లడైంది. కోలీవుడ్లో పలు టీవీ సీరియళ్లలో, సినిమాల్లో వర్ధమాన నటిగా ఎదుగుతున్న శశిరేఖ గత నెల 5న చెన్నైలో హత్యకు గురైంది.
ఆమె మొండెం ఓ మురుగు కాలువ పక్కన పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు, వేలిముద్రల ఆధారంగా మృతురాలిని నటి శశిరేఖగా గుర్తించారు. అటు తర్వాత మరోచోట ఆమె తల భాగం లభించింది. పరారీలో ఉన్న ఆమె భర్త రమేశ్ శంకర్ కోసం గాలించిన పోలీసులు శుక్రవారం అతడిని, నటి లక్కియాను అదుపులోకి తీసుకున్నారు.
వారిని విచారించారు. తనపై, లక్కియాపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతోనే ఇద్దరం కలిసి చంపేశామని భర్త అంగీకరించాడు. 2012లో నటి లక్కియాతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్న రమేశ్ ఆమెతో కలిసి కొత్తవారికి సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ ఓ కంపెనీని ప్రారంభించాడు.
ఈ క్రమంలో భర్త నుంచి విడిపోయి సినిమాల్లో నటిస్తున్న శశిరేఖను 2015లో రమేశ్ పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే శశిరేఖకు ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు.
నిత్యం లక్కియాను భర్త రమేష్ ఇంటికి తీసుకు వచ్చేవాడు. ఆమె తన సోదరి అని శశిరేఖకు చెప్పేవాడు. ఇటీవల రమేశ్, లక్కియా మధ్య ఉన్న వివాహేతర సంబంధం తెలిసి శశిరేఖ పోలీసులను ఆశ్రయించింది. కక్షపెంచుకొని జనవరి 5న శశిరేఖను పథకం ప్రకారం రమేశ్, లక్కియా హత్య చేశారు.