ఇష్రాత్ ట్విస్ట్పై కాంగ్రెస్Xబిజెపి: టెర్రరిస్ట్ల్ని పోరాడితే పోలీసుల్ని జైల్లో పెట్టారు
న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ లష్కరే ఉగ్రవాది అని తేలిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ.. కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకు పడింది. ప్రధాని నరేంద్ర మోడీని ఇన్నాళ్లు లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే క్షమాపణలు చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది.
ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ అంశంపై ప్రజల్ని తప్పుదారిపట్టించేలా కాంగ్రెస్, వామపక్షాలు విషపూరిత ప్రచారం జరిపాయని, ఆమె ఉగ్రవాదేనంటూ పాకిస్తాన్-అమెరికాన్ టెర్రరిస్ట్ డేవిడ్ హెడ్లీ వెల్లడించిన నేపథ్యంలో ఆ పార్టీలు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ డిమాండ్ చేశారు.
తిరువనంతపురంలో గురువారం జరిగిన బిజెపి బహిరంగసభలో ఆయన మాట్లాడారు. హెడ్లీ వెల్లడించిన వివరాలు పాకిస్థాన్ గురించి తేటతెల్లం చేశాయని, అయినప్పటికీ ఆ దేశంతో స్నేహసంబంధాలనే కోరుకుంటున్నామన్నారు.
బిజెపి కార్యదర్శి శ్రీకాంత్ శర్మ ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీని అప్రతిష్ఠపాలు చేయటంలో భాగంగానే ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్పై కాంగ్రెస్ కట్టుకథలను ప్రచారం చేసిందన్నారు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడిన పోలీసులను యూపీఏ ప్రభుత్వం జైళ్లలో పెట్టిందని, సిబిఐ, నిఘావిభాగం వంటి సంస్థలను రాజకీయమయం చేసిందని దుయ్యబట్టారు. సోనియా, రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు.
బిజెపి ఎదురు దాడి కాంగ్రెస్ పార్టీని చిక్కుల్లో పెట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వింత వాదన చేస్తోంది. సోనియా గాంధీ క్షమాపణను బిజెపి కోరడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అది వారు ఫేక్ ఎన్కౌంటర్లో మృతి చెందారని అడగటం ఫండమెంటల్ క్వశ్చన్ అన్నారు.