వాజపేయి అంత్యక్రియలకు ఉగ్రవాది హెడ్లీ సోదరుడు హాజరు! విమర్శలు
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి నివాళులర్పించేందుకు భారత్కు వచ్చిన పాక్ ప్రముఖుల్లో ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ సోదరుడు కూడా ఉండటంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. వాజపేయి అంత్యక్రియలకు అలాంటి వ్యక్తులను ఎలా అనుమతిస్తారంటూ విదేశాంగా శాఖ అధికారులపై మండిపడుతున్నారు.
స్మృతి స్థల్లో గత శుక్రవారం జరిగిన వాజపేయి అంత్యక్రియలకు పాకిస్థాన్కు చెందిన ఐదుగురు ప్రతినిధుల బృందం ఢిల్లీకి వచ్చింది. వీరిలో పాకిస్థాన్ న్యాయ, సమాచార శాఖ మంత్రి సయ్యద్ ఆలీ జాఫర్తోపాటు ఆయన డైరెక్టర్గా వ్యవహరిస్తున్న దన్యల్ గిలానీ కూడా ఉన్నారు.
కాగా, గిలానీకి 26/11 ముంబై దాడులు సూత్రధారి, పాకిస్థానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీ సవతి సోదరుడు కావడంతో.. ఆయన రాకపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు స్పందించారు. విదేశాఖ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు గిలానీ భారత్కు వచ్చారని తెలిపారు.
Pakistan’s Federal Minister for Law and Information Syed Ali Zafar meets India’s Minister for External Affairs @SushmaSwaraj in New Delhi extending condolences on the demise of former Indian PM Atal Bihari Vajpayee. @SyedAliZafar1 pic.twitter.com/mjBJA3oKtR
— Danyal Gilani (@DanyalGilani) August 17, 2018
ఆ సమయంలో ఆమె వాజపేయి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీంతో గిలానీ కూడా అక్కడకు వచ్చారు. ప్రభుత్వాకారిగా ఉన్న ఆయనను అనుమతించకుండా ఉండేందుకు ఎటువంటి కారణాలు కన్పించలేదు. ఆయన బ్లాక్ లిస్టులో కూడా లేరు. అందుకే నిబంధనల ప్రకారమే గిలానీకి వీసా జారీ చేశామని తెలిపారు.
తన గురించి వస్తున్న విమర్శలపై గిలానీ కూడా స్పందించారు. 'ఓ ప్రభుత్వాధికారిగా దేశాని(పాకిస్థాన్)కి సేవ చేయడం నా బాధ్యత డేవిడ్ హెడ్లీ కుటుంబంతో నాకు ఎటువంటి సంబంధాలు లేవు. అయినా ఎవరైనా ఒక వ్యక్తితో బంధుత్వం ఉండటం పాపమేమీ కాదు కదా' అని ఓ జాతీయ మీడియాతో గిలానీ వ్యాఖ్యానించారు. గిలానీ గతంలో పాకిస్థాన్ సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డులో ఛైర్మన్గా, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పత్రికా కార్యదర్శిగా.. గతంలో పనిచేశారు.