భారత్ చేతుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ: డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్గా కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇక భారత్ చేతుల్లోకి రానుంది. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ నిలువెల్లా వణికిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని పర్యవేక్షించే కీలకమైన ప్రపంచ ఆరోగ్య సంస్థను భారత్ తన ఆధీనంలోకి తీసుకోనుంది. డబ్ల్యూహెచ్ఓ కార్యనిర్వాహక మండలి ఛైర్మన్ పదవి ఈ సారి భారత్కు వరించింది. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్గా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నియమితులు అయ్యారు. శుక్రవారం ఆయన బాధ్యతలను స్వీకరించబోతున్నారు. మూడేళ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగనున్నారు.
విశాఖ తీరంలో విధ్వంసం: పోటెత్తుతున్న సముద్రం: మత్స్యకారుల నివాసాల్లో దూసుకొచ్చిన అలలు
194 దేశాలు ఏకగ్రీవంగా..
ప్రస్తుతం ఈ హోదా జపాన్ చేతుల్లో ఉంది. జపాన్కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని.. డబ్ల్యూహెచ్ఓ కార్యనిర్వహక మండలి ఛైర్మన్గా పనిచేస్తున్నారు. ఆయన పదవీ కాలం ముగుస్తోంది. ఆయన వారసుడిగా డాక్టర్ హర్షవర్ధన్ నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థలో సభ్యత్వం ఉన్న 194 దేశాలు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. ఈ పదవికి డాక్టర్ హర్షవర్ధన్ను నామినేట్ చేస్తూ ఇదివరకే కేంద్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలపై ఆయా దేశాల ప్రతినిధులు సంతకం చేశారు. దీనితో ఎలాంటి పోటీ లేకుండా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు.
34 మంది బోర్డు సభ్యులతో
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు డైరెక్టర్లుగా 34 దేశాల ప్రతినిధులు కొనసాగుతున్నారు. రొటేషన్ పద్ధతిన ఛైర్మన్ పదవిని భర్తీ చేస్తారు. డబ్ల్యూహెచ్ఓ తీసుకోబోయే నిర్ణయాలన్నింటినీ సమీక్షించే అధికారం బోర్డుకు ఉంది. ఏడాదిలో కనీసం రెండుసార్లు ఈ బోర్డు సమావేశం కావాల్సి ఉంటుంది. సాధారణంగా జనవరి, మే నెలల్లో సమావేశం అవుతుంటుంది. డబ్ల్యూహెచ్ఓ హెల్త్ అసెంబ్లీ అమలు చేయబోయే ప్రతిపాదనలు, తీసుకునే నిర్ణయాలన్నీ బోర్డు ఆమోదిస్తేనే ఆమల్లోకి వస్తుంటాయని చెబుతున్నారు.
Recommended Video
కరోనాపై పోరాటంలో
సాధారణంగా- ప్రపంచ ఆరోగ్య సంస్థపై పెద్దగా దృష్టి సారించరు. కరోనా వైరస్ ప్రపంచాన్ని తలకిందులు చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం అందరి చూపూ ఆ సంస్థ మీదే ఉంది. డబ్ల్యూహెచ్ఓ ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుంది? వ్యాక్సిన్ తయారీ కోసం ఎలాంటి చర్యలను చేపట్టింది? కరోనా నియంత్రణ చర్యలు ఎలా ఉన్నాయి? అనే అంశాలన్నింటినీ పర్యవేక్షించే సంస్థ కావడం వల్ల ప్రస్తుతం రోజూ వార్తల్లోకి ఎక్కుతోంది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబ్ల్యూహెచ్ఓపై ఆరోపణలు గుప్పించడం, నిధులను తాత్కాలికంగా నిలిపివేయడం వంటి కారణాల వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచింది.