దేశంలో కరోనా తగ్గుతోంది కానీ, వచ్చే 3 నెలలే కీలకం: కేంద్రమంత్రి హర్షవర్ధన్ హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అయితే, వచ్చే మూడు నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలని, కరోనా పరిస్థితిని నిర్ధారించేందుకు ఈ కాలమే ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.
Recommended Video
తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి: 20వేల దిగువకు యాక్టివ్ కేసులు
దేశంలో కొత్త కరోనా కేసులు
కాగా, శుక్రవారం కొత్తగా తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 54,366 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 77,61,312కు చేరింది. కొత్తగా 690 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,17,306కు చేరింది.
7 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
ప్రస్తుతం దేశంలో 6,95,509 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 73,979 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 69,48,497కి చేరింది. క్యుములేటివ్ పాజిటివిరేటు 7.81 శాతం ఉండగా, రోజువారీగా 3.8 శాతంగా ఉంటోంది.
వచ్చే 3 నెలలే కీలకం..
దేశ ప్రజలు కరోనా నిబంధనలను పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటే.. దేశంలో త్వరలోనే కరోనా పూర్తి స్థాయిలో అంతమయ్యే అవకాశం లేకపోలేదని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే, రాబోయే మూడు నెలలు చాలా కీలకమని పేర్కొంది. వచ్చేది పండగలు, శీతాకాలం కావడంతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, అయితే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాతో సమర్థవంతంగా పోరాడవచ్చని కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
కరోనాను అరికట్టాలంటే..
ఇక దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనా పరీక్షలను పెంచాలని, మరణాలు తగ్గించేందుకు సరైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. మాస్కులు ధరించడం లాంటి నిబంధనలను ఇక్కడ కఠినంగా అమలు చేస్తున్నారని చెప్పారు. అక్టోబర్ 20న ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ.. దేశ పౌరులు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా అరికట్టాలని సూచించారని గుర్తు చేశారు మంత్రి హర్షవర్ధన్.