పల్స్ పోలియో టీకాల పంపిణీ కొత్త తేదీ ప్రకటించిన కేంద్రం- కరోనా వ్యాక్సినేషన్ కోసం మార్పు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం కేంద్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భారత్కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్ధలు తయారు చేసిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో ప్రతీ ఏటా జనవరి 17వ తేదీన జరగాల్సిన పల్స్ పోలియో కార్యక్రమం తేదీల్లో కేంద్రం మార్పులు చేసింది.
ఈ ఏడాది కరోనా వ్యాక్సినేషన్ ఉన్నందున జనవరి 17వ తేదీన ప్రారంభం కావాల్సిన పల్స్ పోలియో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్రం ఈ నెల 31కి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా జనవరి 31న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ ప్రకటించింది. భారత్లో పోలియోను శాశ్వతంగా నిర్మూలించేందుకు కొన్నేళ్లుగా చిన్నారులకు పోలియో టీకాలు ఉచితంగా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్నేళ్లుగా విజయవంతంగా అమలు చేస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం వల్ల దేశంలో పోలియో బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది.
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కారణంగా దేశ ఆరోగ్య సేవల లభ్యతలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం భారీ ఎత్తున ఆస్పత్రులు, పీహెచ్సీలు, ప్రైవేటు ఆస్పత్రులను కూడా వినియోగించుకుంటోంది. దీంతో భారీ ఎత్తున ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, ఇతర సిబ్బందిని కూడా వినియోగిస్తోంది. అదే సమయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ తక్షణావసరంగా మారింది. దీంతో సాధారణ వైద్య సేవలకు కూడా ఆటంకం కలిగే పరిస్దితి ఉంది. అలాగే పల్స్ పోలియో కార్యక్రమంపైనా ప్రభావం పడుతోంది.