భారత్ రావాలనుకునే విదేశీయులకు గుడ్ న్యూస్.. నిబంధనలు సడలించిన కేంద్రం..
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం ఈ నిషేధాన్ని సడలించింది. విదేశాల నుంచి భారత్కు వచ్చేందుకు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్,ఇంజనీర్స్,వ్యాపారవేత్తలు,సాంకేతిక సిబ్బందికి అనుమతినిచ్చింది. వీరిని నాలుగు విభాగాలుగా విభజించిన కేంద్రం.. చార్టెడ్ విమానాలు లేదా కమర్షియల్ విమానాల్లో భారత్కు వచ్చేందుకు అనుమతినిచ్చింది. వీరు ఫ్రెష్ బిజినెస్ వీసా లేదా ఫ్రెష్ ఎంప్లాయిమెంట్ వీసాను కలిగి ఉండాలని సూచించింది.
మొదటి విభాగంలో విదేశీ వ్యాపారవేత్తలు భారత్ వచ్చేందుకు కేంద్రం అనుమతించింది. ఇందుకోసం వీరు వీసా దరఖాస్తు చేసుకోవాలి లేదా గతంలో వీసా పొంది ఉంటే.. దాన్ని రీవాల్యుడేట్ చేసుకోవాలి. రెండో విభాగంలో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్,లేబోరేటరీలు,ఫ్యాక్టరీలు,ఫార్మా కంపెనీల్లో మెషీనరీ బాగుచేసే సాంకేతిక సిబ్బందిని అనుమతించింది. మూడో విభాగంలో డిజైనర్లు,వివిధ సంస్థల నిర్వాహకులు,టెక్నికల్ స్టాఫ్,విదేశీ ఇంజనీర్లకు అనుమతినిచ్చింది. ఇక నాలుగో విభాగంలో మెషినరీ ఇన్స్టాల్,నిర్వహణకు భారత్ వచ్చే సిబ్బందికి అనుమతినిచ్చింది.
త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా పునరుద్దరిస్తామని తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతిస్తామన్నారు. అయితే బయటి దేశాలు మన విమానాలకు అనుమతిస్తాయా లేదా అన్న దానిపై అది ఆధారపడి ఉంటుందన్నారు.
కాగా,కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మార్చి నెల నుంచి కేంద్రం విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మే 25వ తేదీ నుంచి దేశీ విమానాయన సర్వీసులను కేంద్రం పునరుద్దరించింది. అలాగే వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తోంది.