పౌండ్ పతనం: బ్రిటన్లోని ఎన్నారైలకు ఫుడ్ కష్టాలు
లండన్: బ్రెగ్జిట్ ప్రభావం బ్రిటన్లోని ప్రవాస భారతీయులపై పెను ప్రభావాన్ని చూపుతుంది. బ్రెగ్జిట్తో బ్రిటిష్ పౌండ్ భారీగా పతనమవడంతో కూరగాయలు, పండ్లు ముఖ్యంగా భారత్ నుంచి ఎగుమతి అయ్యే వాటి ధరలు యూకేలో విపరీతంగా పెరిగిపోయాయి.
దీంతో బెండకాయ, మిర్చి, బేబీ కార్న్లతో పాటు మామిడి పండు లాంటి వాటికి బ్రిటన్లోని ప్రవాస భారతీయులు ప్రస్తుతానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక అనిశ్చితి పెరిగిన తరుణంలో, దక్షిణాసియా నుంచి ఎగుమతి అయ్యే పండ్లు, కూరగాయలకు డిమాండ్ తగ్గిందని ట్రేడర్లు అంటున్నారు.
నిజానికి బ్రిటన్లోని దక్షిణాసియా ప్రజలు, ధరలకు సంబంధం లేకుండానే కూరగాయలను కొనుగోలు చేస్తుంటారు. భారత్ నుంచి ఎగుమతయ్యే మామిడి, దానిమ్మ వంటి పండ్లతో పాటు బెండకాయలు, మిర్చి లాంటివి కొనుగోలు చేస్తుంటారు. అయితే, బ్రెగ్జిట్ కారణంగా బ్రిటన్లో ధరలు ఒకేసారి 10 శాతం కన్నా ఎక్కువగా పెరిగాయి.
ఇలాంటి సమయంలో కొంతకాలం వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని ప్రవాస భారతీయులు అనుకుంటున్నారట. అంతేకాదు వేసవిలో మామిడి నోరు ఊరిస్తున్నా జిహ్వ చాపల్యాన్ని చంపేసుకుని దొరికిన ఆహారాన్ని తింటూ సర్దుకుపోతున్నారట.
31 ఏళ్ల కనిష్టానికి పౌండ్ రేటు పతనమవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లపై ప్రభావాన్ని అధికంగా చూపుతోందని కేబీ ఎక్స్పోర్ట్స్ సీఈఓ కుషాల్ కక్కర్ అభిప్రాయపడ్డారు. 2014-15లో భారత్ నుంచి రూ. 2,771.32 కోట్ల విలువైన పండ్లు, రూ. 4,702.78 కోట్ల విలువైన కూరగాయలు ఎగుమతి అయ్యాయని తెలిపారు.
ఇందులో యూరప్ దేశాలతో పోలిస్తే, యూకేకు అత్యధిక ఎగుమతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఇక 2015-16లో ఇప్పటివరకూ రూ. 183 కోట్ల విలువైన కూరగాయలు ఎగుమతి అయ్యాయని, రూ. 209 కోట్ల విలువైన ద్రాక్ష, రూ. 32 కోట్ల విలువైన మామిడి ఎగుమతి అయిందని పేర్కొన్నారు.
తాజాగా బ్రెగ్జిట్కు బ్రిటన్ ప్రజలు మద్దతు తెలపడంతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగితే ఎగుమతి నిబంధనలు మరింత సరళీకృతం కావొచ్చని భావిస్తున్నారు.