ఫ్లోర్ టెస్ట్ను ఆపాల్సి ఉంటుంది, లైవ్కు ఆదేశాలు: కాంగ్రెస్-జేడీఎస్లకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
బెంగళూరు: ప్రొటెం స్పీకర్ బొపయ్యను నియమించడంపై సుప్రీం కోర్టులో శనివారం ఉదయం పదిన్నర గంటలకు వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్గా బొపయ్య నియామకం సరికాదని కాంగ్రెస్ తరఫు లాయర్ కపిల్ సిబాల్ అన్నారు. ఆయన విశ్వాస పరీక్ష చేపట్టవద్దన్నారు. గతంలో కోర్టు ఆయనకు మొట్టికాయలు వేసిందన్నారు.
ప్రొటెం స్పీకర్ నియామకం ఏకపక్ష నిర్ణయమని కపిల్ సిబాల్ చెప్పారు. సీనియర్ మోస్ట్ లీడర్ ప్రొటెం స్పీకర్ కావాలన్నారు. బోపయ్యను ప్రొటం స్పీకర్గా నియమించడం ద్వారా నియమ, నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు.
బోపయ్య నియామకం విషయమే సిబాల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడం వరకైతే ఫర్వాలేదని, కానీ ఆయన విశ్వాస పరీక్షను లీడ్ చేయడం సరికాదన్నారు. గతంలో బోపయ్యపై ఆరోపణలు ఉన్నాయని కోర్టుకు వెల్లడించారు. 2011లో సుప్రీం కోర్టు బోపయ్యకు అక్షింతలు వేసిందని చెప్పారు.
దానికి సుప్రీం కోర్టు స్పందిస్తూ.. ఎప్పుడు కూడా సీనియర్ నేతలో ప్రొటెం స్పీకర్లుగా వ్యవహరించలేదు కదా అని ప్రశ్నించారు.
డివిజన్ ద్వారా బలపరీక్షకు ఆదేశాలు జారీ చేస్తామని, అసెంబ్లీ బలపరీక్షను లైవ్ ద్వారా ప్రసారం చేయాలని ఆదేసాలు జారీ చేస్తామని, మీరు (కాంగ్రెస్-జేడీఎస్) చెప్పినట్లు ప్రొటెం స్పీకర్ నియామకంపై విచారణ జరగాలంటే ఆయనకు నోటీసు ఇవ్వాలని, అప్పుడు బలపరీక్షను వాయిదా వేయాల్సి వస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రొటెం స్పీకర్ నియామకాన్ని తప్పుపడుతూ కాాంగ్రెస్ - జేడీఎస్ వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టివేసినప్పటికీ, వారు అడిగిన సౌకర్యాలకు అంగీకరించింది.
విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ తరఫు లాయర్లు అభిషేక్ సింఘ్వీ, కపిల్ సిబాల్లు సుప్రీం కోర్టుకు వచ్చారు. సీనియర్ అడ్వోకేట్ రామ్ జెఠ్మలానీ కూడా హాజరయ్యారు. కేంద్రం తరఫున కేకే వేణుగోపాల్ వచ్చారు. బీజేపీ తరఫున ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ వాదనలు వింటోంది.