"తాతా కళ్లు తెరువు తాతా" : ఉగ్రదాడిలో తాత మృతి..వెక్కి వెక్కి ఏడ్చిన మూడేళ్ల బాలుడు
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లోని సోపోర్లో బుధవారం ఉదయం సీఆర్పీఎఫ్ బలగాలకు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్ జవాను అమరుడయ్యాడు. ప్యాట్రోల్ టీమ్లో ఉన్న ఈ జవానుపై ఉగ్రమూకలు తుపాకులతో కాల్పులు జరిపాయి. ఇదిలా ఉంటే ఈ కాల్పుల్లో ఒక పౌరుడు కూడా మృతి చెందాడు. అయితే మృతి చెందిన ఈ పౌరుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోను చూస్తే హృదయం చలించక మానదు.
తాతా కళ్లు తెరువు తాతా..
"తాతా కళ్లు తెరువు తాతా.. తాతా నన్ను చూడు. తాతా భయంగా ఉంది. పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి ఒక్కసారి చూడు తాతా" అంటూ ఏడుస్తున్న మూడేళ్ల బాలుడి కన్నీటి కథ ఇది. సోపోర్లో సీఆర్పీఎఫ్ బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక జవాను అమరుడుకాగా మరో పౌరుడు మృతి చెందాడు. మృతుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోటో గమనిస్తే ఓ మూడేళ్ల కుర్రాడు మృతుడి పై కూర్చొని ఏడుస్తున్నాడు. . అప్పటికే కాల్పులు జరుగుతుండగా ఆ చిన్నారి రక్తపుమడుగులో పడిపోయిన తన తాత వద్ద కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తుండటం పలువురిని కదిలించివేసింది. ఇది గమనించిన పోలీసులు వెంటనే కుర్రాడిని రక్షించారు.
ఏం జరిగింది..
ఆ చిన్నారిని ఓదార్చడం వారి తరం కాలేదు. తన తాత మృతదేహాన్ని చూసి ఆ చిన్నారి భయంతో ఏడ్చాడు. పోలీసులు ఎంత ఓదార్చి నప్పటికీ తన తాత కావాలంటూ ఏడ్చాడు. పోలీసులు ఆ చిన్నారిని ముందుగా హాస్పిటల్కు తీసుకెళుతున్న ఫోటోను ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే శ్రీనగర్ నుంచి హంద్వారాకు ఆ చిన్నారి తన తాతతో కారులో బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. సోపోర్ పట్టణానికి చేరుకోగానే ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో కారు అటువైపుగా రావడంతో కారుకు బుల్లెట్లు తగిలాయి. వెంటనే కారును పక్కకు ఆపి మనవడితో దిగిన తాత తూటాలకు నేలకొరిగాడు.చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడగా తన తాత మృతి చెందాడు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఎదురు కాల్పులకు దిగారు. అయితే ఉగ్రవాదులు తప్పించుకున్నారు.
Recommended Video
వారం రోజుల క్రితం తూటాలకు బాలుడు బలి
గతవారం కూడా అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నీహాన్ ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. పార్క్ చేసి ఉన్న కారులో నీహాన్ నిద్రిస్తుండగా కారుకు తూటాలు తగిలాయి. ఒక తూటా బాలుడికి తగలడంతో మృతి చెందాడు. బైకుపై వచ్చిన ఉగ్రవాదులు ప్యాట్రోలింగ్ చేస్తున్న జవాన్లపై కాల్పులు చేసిన క్రమంలో ఆ తూటాలు కారుకు తగిలాయని పోలీసులు చెప్పారు. అయితే ఈ ఘటనపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అనంతనాగ్లో కాల్పులు జరిపిన ఉగ్రవాది మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకోగా అతనితోపాటు నక్కిఉన్న ఇద్దరు ఉగ్రవాదులను సీఆర్పీఎఫ్ బలగాలు మట్టుబెట్టాయి.