కాశ్మీర్ ఉగ్రదాడి: గుండె పగిలిందని సెహ్వాగ్, మనమిలా పాక్ అలా.. గంభీర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లోని యురి సెక్టార్లో జరిగిన ఉగ్రదాడిలో 17 మంది జవాన్లు మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున సైనిక స్థావరంపై ఉగ్రవాదులు తొలుత గ్రెనేడ్ దాడి చేశారు. దీంతో టెంట్లకు నిప్పంటుకోవడం, ఆసమయంలో జవాన్లు నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు.
నలుగురు ఉగ్రవాదులు ఉదయం నాలుగు గంటల సమయంలో గ్రనేడ్లతో దాడి చేసి ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. ఆరు గంటల పాటు సాగిన భీకర పోరులో భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
సైనిక స్థావరంలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లలో ఉన్నారని, ఆ సమయంలో దాడి జరగడంతో టెంట్లకు నిప్పంటుకొని సిబ్బంది తీవ్రంగా గాయపడటంతో పాటు భారీగా ప్రాణనష్టం జరిగిందంటున్నారు.
గుండె పగిలింది: సెహ్వాగ్
యూరీ సెక్టార్లోగల ఆర్మీ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. ఉగ్రదాడి వార్త వినగానే తన గుండె పగిలిందన్నారు. దాడి చేసిన వాళ్లు రెబల్స్ కాదని ఉగ్రవాదులేనని సెహ్వాగ్ అన్నారు. అయితే ఉగ్రవాదానికి తప్పకుండా సరైన సమాధానం చెప్పాల్సిందేనని అతను ట్వీట్ చేశారు.
మనం సంయమనం పాటిస్తుంటే పాకిస్తాన్ రోతను ప్రదర్శిస్తోందని గౌతమ్ గంభీర్ అన్నారు. మనం పరిష్కారానికి ముందుకొస్తుంటే పాక్ బుల్లెట్లతో సమాధానం ఇస్తోందని మండిపడ్డారు. జవాన్లు చనిపతే వాళ్లు ఖండిస్తారు, ఇంకేమీ ఉండదన్నారు.