అక్కడ ఠారెత్తిస్తున్న ఎండలు... రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
Recommended Video
ఢిల్లీ: రానున్నరెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దేశరాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 46.2 డిగ్రీలు తాకుతాయని అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సోమవారం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో మేఘాలు లేకపోవడం వడగాలులు వీయడంతో ఉష్ణోగ్రతల్లో పెను మార్పు కనిపిస్తోందని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు.
ఢిల్లీ, దక్షిణ ఉత్తర ప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సౌరాష్ట్రలలో ఉష్ఱోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించగా మధ్య భారతదేశానికి ఇవి విస్తరించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని వారు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో వేడి తారాస్థాయిలో ఉన్నందున వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ను ప్రకటించారు. సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ను తాకిన సమయంలో రెడ్ అలర్ట్ను అధికారులు జారీ చేస్తారు. ఢిల్లీలో ఆదివారం ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు సెల్సియస్గా నమోదు అయ్యింది.
అయితే రానున్న రోజుల్లో ఎండవేడిమి నుంచి ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభిస్తుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. త్వరలో ఇసుక తుఫాను లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. జూన్ 11 లేదా 12న వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పడిపోతాయని వెల్లడించింది. వారంరోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకిని రుతుపవనాలు అరేబియన్ సముద్రం మీదుగా లక్ష్వద్వీప్, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయని తెలిపింది. మరో 48 గంటల్లో ఈశాన్య భారతంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొంది.