వడగాలులు భారత్కు ప్రమాదకరంగా మారనున్నాయా...2015 రిపీట్ అవుతుందా..?
మరోసారి వాతావరణం తన విశ్వరూపం చూపేందుకు సిద్దమవుతోంది. బలమైన వడగాలులు మళ్లీ దేశంపై పంజా విసిరేందుకు తయారవుతున్నాయి. 2015వ సంవత్సరంలో వడగాలులు దెబ్బకు దాదాపు 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ అదే స్థాయిలో విరుచుకపడేందు వడగాలులు సిద్ధమవుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 2 డిగ్రీల సెల్సియస్ మేరా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగితే ఇక తీవ్రపరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ).
వాతావరణంలో మార్పులతో భారత్కు దెబ్బ
ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ విడుదల చేసిన నివేదికపై డిసెంబర్ నెలలో పోలాండ్లో జరగనున్న కాటోవైస్ క్లైమేట్ ఛేంజ్ సదస్సులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పారిస్ వాతావరణ ఒప్పందంపై కూడా చర్చిస్తారు. కార్బన్ ఉద్గరాలు విడుదల చేస్తున్న దేశాల్లో ముందువరసలో ఉన్న భారత్ ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించనుంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 2030వ సంవత్సరం కంటే ముందే ఉష్ణోగ్రతలు ప్రమాదస్థాయిని తాకుతాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. 1.5 డిగ్రీల సెల్సియస్ మేరా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు అంచనా వేశాయి ఆ నివేదికలు. ఇక ఐపీసీసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్లో కోల్కతా నగరంలో ఈ వడగాలుల ధాటికి అల్లాడిపోతుందని... పాకిస్తాన్లో కరాచీ నగరంకు కూడా ఇదే ప్రమాదముందని తెలిపింది. ఇవి 2015లో వచ్చిన వడగాలుల మాదిరే ఉంటాయని పేర్కొంది. వాతావరణంలో మార్పులు క్రమంగా వేడిగాలులకు కారణమవుతున్నాయని నివేదిక పేర్కొంది.
గ్లోబల్ వార్మింగ్తో ఆకలి చావులు తప్పవు
ఇక గ్లోబల్ వార్మింగ్ వల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల సెల్సియస్ వద్దే ఆగిపోవాలంటే మానవుడు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు 45 శాతానికి పడిపోవాలని 2030 నాటికి ఇది జరిగితే...2050 నాటికి కార్బన్ ఉద్గారాల సంఖ్య సున్నాకు పడిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఐపీసీసీ విడుదల చేసిన నివేదికలోని "1.5. హెల్త్ రిపోర్ట్"ను యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ నిపుణులు, ఐక్యరాజ్యసమితి , కైమేట్ ట్రాకర్ సంస్థలు నివ్వెరపోయే నిజాన్ని వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా రెండు డిగ్రీల సెల్సియస్ మేరా ఉష్ణోగ్రతలు పెరుగుదల నమోదు చేస్తే ఎక్కువగా నష్టపోయేది భారత్, పాకిస్తాన్ దేశాలే అని హెచ్చరించాయి. ఒకవేళ ఇదే జరిగితే ఈ దేశంలో పేదరికం పెరిగిపోతుందని..తద్వారా ఆహార భద్రతకు కరువు ఏర్పడుతుందని హెచ్చరించింది. అదే సమయంలో ఆహార ధరలు పెరిగిపోవడం, ఆదాయం కోల్పోవడం, జీవనం సాధించేందుకు అవకాశాలు కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు, వలసలు లాంటివి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని సంస్థలు సూచిస్తున్నాయి.
గ్లోబల్ వార్మింగ్ను నియంత్రిస్తేనే పంటలు సేఫ్గా ఉంటాయి
గ్లోబల్ వార్మింగ్ పెరుగుదలతో పేదరికం కూడా పెరుగుతుందని ఐపీసీసీ చెబుతోంది. గ్లోబల్ వార్మింగ్ను 1.5 డిగ్రీల సెల్సియస్కే నిలువరించగలిగితే చాలా వరకు నష్టాలను అరికట్టే అవకాశముందని వెల్లడించింది. అంతేకాదు వరి, కంకి, గోదుమ ఇతరత్ర పంటలను కూడా పరిరక్షించే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఇక కార్బన్ విడుదలను కూడా చాలా వరకు నియంత్రించాలని సూచించింది ఐపీసీస. భారత్ నుంచి 929 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతోంది. ఇది కేవలం ఒక్క థర్మల్ పవర్ రంగం నుంచే జరుగుతోంది.