వాడి వేడిగా 2గం. 20 నిమిషాలు.. 150 పైచిలుకు ప్రశ్నలకు సమాధానం చెప్పని ఫేస్బుక్...
వాల్ స్ట్రీట్ జనరల్ కథనం తర్వాత భారత్లో ఫేస్బుక్ పాలసీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలను ఫేస్బుక్ చూసీ చూడనట్లు వదిలేస్తోందని... ఒకరకంగా ఇది ఆ పార్టీ పట్ల అనుకూల వైఖరిని ప్రదర్శించడమేనని ఆ కథనంలో ఆరోపించారు. వాల్ స్ట్రీట్ కథనం భారత్లో పెను దుమారమే లేపింది.
Recommended Video
ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఫేస్బుక్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందంటూ ఫైర్ అయింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేత్రుత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనిపై వివరణ కోరుతూ ఫేస్బుక్ యాజమాన్యానికి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫేస్బుక్ ఇండియా చీఫ్ అజిత్ మోహన్ కమిటీ ముందు హాజరయ్యారు.
వాడి వేడిగా 2గంటల 20 నిమిషాలు..
బుధవారం(సెప్టెంబర్ 2) జరిగిన ఈ కమిటీ సమావేశం దాదాపు 2గంటల 20 నిమిషాల పాటు సాగింది. అటు బీజేపీ,ఇటు కాంగ్రెస్ వాదనలతో వాడి వేడిగా సాగిన సమావేశంలో ఇరు పార్టీలు ఫేస్బుక్పై పలు ప్రశ్నలు సంధించాయి. ఇరు పార్టీలు విద్వేషపూరిత ప్రసంగాల గురించి ప్రస్తావించాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విద్వేష వ్యాఖ్యలతో పాటు బెంగాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విద్వేషపూరిత వ్యాఖ్యలను ప్రస్తావించింది. అటు బీజేపీ గతంలో సోనియా చేసిన 'అంతం చేసేవరకూ పోరాడుదాం..' వ్యాఖ్యలను ప్రస్తావించింది. అలాగే జేఎన్యూ మాజీ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని పేర్కొంది.
ఫేస్బుక్కి సంధించిన ప్రశ్నలు...
ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు,వ్యాఖ్యల పట్ల ఫేస్బుక్ ఎన్నిసార్లు చర్యలు తీసుకుంది... ఎన్నింటిని సుమోటోగా స్వీకరించారని స్టాండింగ్ కమిటీలోని ఎంపీలు సోషల్ మీడియా దిగ్గజం తరుపున హాజరైన ప్రతినిధులను ప్రశ్నించారు. అయితే ఇలాంటి వాటికి సంబంధించి తమ వద్ద ప్రత్యేక నంబర్స్ ఏమీ లేవని వారు బదులిచ్చారు. చాలా సందర్భాల్లో తమకేదైనా ఫిర్యాదు అందినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోబడ్డాయని తెలిపారు.
ఏ పార్టీకైనా అనుకూలంగా పనిచేస్తోందా..?
ఫేస్బుక్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందా అన్న కాంగ్రెస్ ప్రశ్నలకు అటునుంచి సమాధానం రాలేదు. మరోవైపు బీజేపీ... కాంగ్రెస్,వామపక్షాలకు ఫేస్బుక్ అనుకూలంగా పనిచేస్తోందంటూ పలు ఉదాహరణలను ప్రస్తావించింది. ఫేస్బుక్ ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్వర్క్ కమిటీ&అపాయింట్మెంట్స్ హెడ్ కాంచన్ కౌర్ అధికార పార్టీ సహా ప్రధాని మోదీపై అభ్యంతరకర భాషతో దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఫేస్బుక్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ మెంబర్గా ప్రతీ సిన్హా నియామకం కూడా కాంగ్రెస్ అనుకూల ధోరణే అని బీజేపీ ఎంపీలు ఆరోపించారు.
కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తిని ఫేస్బుక్లో నియమించుకోవడంపై...
ప్రతీక్ సిన్హాపై బీజేపీ చేసిన ఆరోపణలకు ఫేస్బుక్ ఇండియా చీఫ్ అజిత్ మోహన్ వివరణ ఇచ్చారు. ప్రతీక్ సిన్హా గతంలో కేరళ కాంగ్రెస్కు కన్సల్టెంట్గా పనిచేశారని చెప్పారు. మెకంజీ తరుపున యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ పనిచేసినట్లు చెప్పారు. ప్రస్తుత మోదీ సర్కార్కు వ్యతిరేకంగా సిన్హా రాసిన అన్ని ఆర్టికల్స్ను ఆయనే తొలగించేశారని తెలిపారు. అయితే ఫేస్బుక్లో బీజేపీ,శివసేన,వీహెచ్పీ,భజరంగ్ దళ్,ఆర్ఎస్ఎస్ల నుంచి కూడా ఎవరినైనా నియమించుకున్నారా అని అధికార పార్టీ ఎంపీలు ప్రశ్నించారు. దీనికి తమ వద్ద ఎలాంటి డేటా లేదని ఫేస్బుక్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
వాటిపై చర్యలేవీ...?
'ఫేస్బుక్ ఫర్ ముస్లిమ్స్' లాంటి గ్రూపుల ఏర్పాటుపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని బీజేపీ ప్రశ్నించగా... అలాంటి వాటిని బ్లాక్ చేసేందుకు లేదా వాటిపై అభ్యంతరం చెప్పేందుకు తమ వద్ద ఎలాంటి పాలసీ లేదని ఫేస్బుక్ ప్రతినిధులు తెలిపారు. ఫేస్బుక్లో జైశ్రీరామ్ లేదా ఇతర దేవుళ్లకు సంబంధించిన పోస్టులపై విద్వేషపూరితమైనవి అన్న ముద్ర వేస్తున్నారని... మరోవైపు 'న్యాయం కోసం సిక్కులు' అన్న ఓ గ్రూప్ భారతదేశ చిత్ర పటాన్ని వక్రీకరిస్తూ పోస్టు పెడితే చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎంపీలు ప్రశ్నించారు.
మరోసారి సమావేశం...?
ఈ సమావేశంలో ఫేస్బుక్ 150 పైచిలుకు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయింది. వీటిపై లిఖితపూర్వక వివరణ ఇచ్చేందుకు అంగీకరించింది. మొత్తంగా ఈ సమావేశం అసంపూర్తిగానే ముగియడంతో... మరోసారి ఇదే అంశంపై సమావేశమవ్వాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛైర్మన్ శశి థరూర్ అభిప్రాయపడ్డారు. అయితే సెప్టెంబర్ 12 లోపే ఛైర్మన్గా శశి థరూర్ పదవీ కాలం ముగుస్తుండటంతో ఆయన చెప్పినట్లుగా మరోసారి సమావేశం కుదరకపోవచ్చు.