ఠారెత్తిస్తోన్న ఎండలు:చురూలో 50 డిగ్రీలు.. ఢిల్లీలో 18 ఏళ్ల రికార్డు బద్దలు..
ఓ వైపు కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండగా, దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. వడగాలులు ఉధృతమయ్యాయి. ఉత్తర భారతం వెచ్చటి గాలులతో వణికిపోతున్నది. ఈ క్రమంలో దేశంలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల వివరాలను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసింది. రాజస్థాన్లోని చురూలో అత్యధికంగా 50డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ అధికారులు చెప్పారు.
అదే సమయంలో దేశరాజధాని ఢిల్లీలో 18 ఏళ్ల తర్వాత అత్యధికంగా పాలమ్లో 47.6డిగ్రీలు నమోదైందని తెలియజేశారు. ఇది దేశంలోనూ రెండో అత్యధికం. పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, దక్షిణ హరియాణా, ఢిల్లీ, దక్షిణ ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్, విదర్భ తదితర ప్రాంతాల్లో వేడిగాలులు కొనసాగుతున్నాయని ఐఎండీ తెలిపింది. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
సోమవారం రోహిణి కార్తె మొదలవగా ఈ ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు కూడా వీయనున్నారని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు మూడు రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈనెల 28 వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ఐఎండి హెచ్చరికలు జారి చేసింది. తెలుగు రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలో 48 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలలో 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవగా వచ్చే మూడు రోజులు భయాందోళనగా మారాయి.