వర్షాలతో వణికిపోతున్న ముంబై... రత్నగిరిలో డ్యాంకు గండి.. వరద నీటిలో కొట్టుకుపోయిన ఇళ్లు..
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై మునిగిపోయింది. ఆదివారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వరద నీటితో నిండిపోయింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు వర్షం పడుతూనే ఉంది. దీంతో ఎటు చూసినా వరద నీళ్లే కనిపిస్తున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తుండగా.. రైల్వే ట్రాకులు వరద నీటిలో మునిగిపోయాడు. బయట అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది.
రత్నగిరిలో కొట్టుకుపోయిన ఇళ్లు
కుండపోత వర్షాల కారణంగా డ్యాంలకు భారీగా వరదనీరు చేరుతోంది. రత్నగిరిలోని తివారీ డ్యాంకు గండిపడింది. దాని దిగువన ఉన్న 7గ్రామాల్లోకి భారీగా వరదనీరు చేరింది. డ్యాంకు దగ్గరలో ఉన్న 12 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 23 మంది గల్లంతయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి.
35కు చేరిన మృతులు
కుంభవృష్టి వర్షాల కారణంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 35మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబై శివార్లలోని మలాడ్, పూనే, కల్యాణ్ ప్రాంతాల్లో గోడ కూలిన ఘటనల్లో 30మంది చనిపోయారు. దాదాపు వంద మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. మలాడ్లో పింప్రిపాద ఏరియాలో గోడ కూలి పక్కనే ఉన్న గుడిసెలపై పడటంతో 21మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా 14మంది మృత్యువాతపడ్డట్లు అధికారులు ప్రకటించారు.
రైళ్లు, విమాన సర్వీసులు రద్దు
భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. లోకల్ ట్రైన్ల సంఖ్య భారీగా తగ్గిపోయాయి. ముంబై నుంచి దూర ప్రాంతాలను రాకపోకలు సాగించే పలు రైళ్లలో కొన్ని రద్దుకాగా.. మరి కొన్నింటిని దారి మళ్లించారు. చాలా వరకు లోకల్ సర్వీసులు నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్థులు ఆఫీసులకు వెళ్లేందుకు నానా ప్రయాసలు పడుతున్నారు. మరోవైపు వానల ప్రభావం విమాన సర్వీసులపైనా పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 205 ఫైట్లు రద్దుకాగా.. మరికొన్నింటిని దగ్గరలోని ఎయిర్పోర్టులకు మళ్లించారు.
రికార్డు స్థాయి వర్షాలు
ముంబైలో వానలో రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. జులై నెలలో ఒక్కరోజులో ఇంత వాన కురవడం 1975 తర్వాత ఇది రెండోసారి అని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. 14ఏళ్ల క్రితం 2005లో కూడా జులై 26-27 తేదీల్లో 24గంటల వ్యవధిలో 94.4 సెంటీమీటర్ల వాన కురిసి ముంబైని ముంచేసింది. అప్పట్లో వర్షాల కారణంగా వెయ్యి మంది చనిపోయారు. మళ్లీ ఆ స్థాయిలో వానలు పడటం ఇదే తొలిసారి.