బెంగాల్ లో 8 జిల్లాలపై తీవ్ర ప్రభావం..! ఒడిశాను వణికిస్తున్న ఫొని..!!
హైదరాబాద్: తీవ్ర తుఫాన్గా మారిన ఫొని, ఒడిశాను మంచెత్తుతోంది. కాసేపటి క్రితం ఫొని తుఫాన్.. పూరీ వద్ద పూర్తి స్థాయిలో తీరాన్ని దాటింది. రెండు దశాబ్ధాల్లో అత్యంత శక్తివంతమైన తుఫాన్గా ఫొని ఇప్పటికే రికార్డు సృష్టించింది. తీరం దాటడంతో.. పూరీలో భీకరమైన వర్షాలు కురుస్తున్నాయి. గంటకు సుమారు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పూరీ వద్ద ఫొని పూర్తి స్థాయిలో తీరాన్ని దాటేసినట్లు భారతీయ వాతావరణశాఖ వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఫొని తీరం దాటింది. కానీ పూరీ పట్టణంలో మరో మూడు రోజుల పాటు బలమైన గాలులు వీయనున్నాయి. ఫొని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, బెంగాల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇండియన్ నేవీకి చెందిన మూడు నౌకలు సహ్యాద్రి, రణ్వీర్, కాద్మట్లు రిలీఫ్ సామాగ్రితో అప్రమత్తంగా ఉన్నాయి. అతితీవ్ర తుఫాన్గా ఒడిశాను చేరుకున్న ఫొని.. ఈశాన్య దిశగా కదులుతూ రానున్న ఆరు గంటల్లో తీవ్ర తుఫాన్గా మారనున్నదని ఐఎండీ తెలుపుతోంది.
ఫొని తుపాను బంగాల్ దిశగా పయనిస్తోంది. కటక్, జైపూర్, భద్రక్, బాలసోర్ మీదుగా ఫోని బెంగాల్లో ప్రవేశించనుంది. సాయంత్రం నుంచి ఎనిమిది జిల్లాలపై ఫొని ప్రభావం చూపనుంది. ఫొని తుపాను వల్ల గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను ముంచుకొస్తున్న వేళ బంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్కతా పశ్చిమ మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, ఝార్గ్రామ్, సుందర్బన్, జిల్లాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాల్ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. తీరప్రాంతాలకు వెళ్లవద్దని బంగాల్ సర్కారు పర్యాటకులను కోరింది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచనలు చేసింది. రేపు ఉదయం 8 గంటలకు కోల్కతా విమానాశ్రయం మూసివేయనున్నారు.