కోస్తాలో భారీ వర్షాలు, కుప్పకూలిన ఇండ్లు, ఇద్దరి మృతి, సీఎం ఆదేశం, కేంద్రం సహకారం!
Recommended Video
బెంగళూరు: కర్ణాటకలోని కరావళి (కోస్తా ప్రాంతం)లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. కర్ణాటక కరావళి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇద్దరు మృతి చెందారు. కరావళి ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరం చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సహాయక చర్యలకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది.
ఇద్దరు బలి
కర్ణాటకలోని కరావళి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. ఇల్లు కుప్పకూలడంతో మోహిని అనే మహిళ శిథిలాల్లో చిక్కుకునింది. మోహినిని రక్షించడానికి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె మరణించింది. వర్షం నీటిలో కొట్టుకుని వెళ్లి ఓ చిన్నారి మరణించింది.
జలమయం
మంగళూరు నగరంతో పాటు కరావళి ప్రాంతంల్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ఇళ్లు కుప్పకూలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
విమాన సర్వీసులు
మంగళూరు జిల్లాతో పాటు కరావళి ప్రాంతాల్లోని జిల్లాల్లో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మంగళూరు చేరుకునే అనేక రహదారులు జలమయం అయ్యాయి. మంగళూరులో బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమాన సర్వీసులను తాత్కాలికంగా వేరే ఎయిర్ పోర్టులకు మళ్లించారు.
సీఎం చర్చలు, ఎన్ డీఆర్ఎఫ్
ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మంగళూరుతో పాటు కరావళి జిల్లాల్లోని అధికారులతో చర్చించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ డీఆర్ఎఫ్ కు చెందిన 38 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
మోడీ ఆదేశాలు
కర్ణాటకలోని కరావళి ప్రాంతంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి అవసరం అయిన చర్యలు తీసుకోవాలని కేంద్రంలోని సంబంధిత అధికారులకు సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కర్ణాటకలోని కరావళి ప్రాంతంలో సహాయక చర్యలకు సహకరించాలని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప కేంద్ర హోం శాఖకు మనవి చేశారు. సహాయక చర్యలకు కేంద్ర హోం శాఖ పూర్తిగా సహకరిస్తోంది.