కుండపోత..ఈదురుగాలి: వణుకుతున్న ఢిల్లీ: కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రత.. !
Recommended Video
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గురువారం రాత్రి వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్మలంగా కనిపించిన ఆకాశం కాస్తా రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా మేఘావృతమైంది. కుండపోతగా వర్షం కురిసింది. పార్లమెంట్ భవనం సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
క్షీణించిన ఉష్ణోగ్రత..
ఒక్కసారిగా చోటు చేసుకున్న వాతావరణ మార్పుల ఫలితంగా- ఢిల్లీలో ఉష్ణోగ్రత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గురువారం రాత్రి 10 గంటల సమయానికి 12.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ప్రస్తుత శీతాకాల సీజన్ లో ఇదే అత్యల్పమని వాతావరణ శాఖ ప్రాంతీయ అధికారి కుల్ దీప్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఢిల్లీ సహా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
మరో 24 గంటల పాటు..
ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్, గ్రేటర్ నొయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్లు పడినట్లు తెలుస్తోంది. మరో 24 గంటల పాటు ఇదే తరహా వాతావరణం నెలకొని ఉంటుందని కుల్ దీప్ శ్రీవాస్తవ అంచనా వేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలు సహా పొరుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుందని చెప్పారు.