ముంబైని ముద్ద చేసిన భారీ వర్షాలు..రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
Recommended Video
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై వరుణుడు ఇప్పుడప్పుడే కరుణచూపేలా లేడు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ముంబై నగరం అస్తవ్యస్తంగా మారింది. రానున్న 24 గంటల్లో ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణశాఖ చేసిన తాజా ప్రకటన ప్రజల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించాలంటూ అధికారులకు సూచించింది కేంద్ర వాతావరణ శాఖ. అంతేకాదు శనివారం సముద్రంలో అలలు కూడా విపరీతంగా ఎగిసి పడుతాయని దీనికి తోడు భారీ వర్షాలు కురువనుండటంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ముంబైకు దగ్గరలోని పాల్ఘర్, థానే జిల్లాలో ప్రజాజీవితం భారీ వర్షాల కారణంగా అస్తవ్యస్తంగా మారింది.
థానేలో కురిసిన భారీ వర్షాలకు ఓ బేకరీలోని పైకప్పు కూలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా మరో వ్యక్తికి కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఇక భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సముద్రం సమీపంలోకి వెళ్లరాదని బృహన్ముంబై అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆగష్టు 3వ తేదీ మధ్యాహ్నం నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇక రానున్న 36 గంటల్లో ముంబై, థానే , నవీముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మీటియరాలజీ కేఎస్ హోసలికర్ ట్వీట్ చేశారు.
ఇక గత రాత్రంత కురిసిన భారీ వర్షాలతో ముంబై రోడ్లు జలమయమయ్యాయి. రైల్వే పట్టాలపై వర్షపు నీరు చేరడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు. ఇక భారీ వర్షాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఇక ఇబ్బందులు తలెత్తితే 100 అనే నెంబరుకు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇక వర్షపు నీరు కొన్ని ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.