ఇంకో రౌండ్: ఏపీకి పొంచివున్న భారీ వర్షాలు: అక్కడ మైనస్కు చేరిన టెంపరేచర్
చెన్నై: మరో విడత భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. రాయలసీమ, ఏపీ దక్షిణ ప్రాంత జిల్లాలతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22వ తేదీ వరకూ ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బంగాళాఖాతం ఉపరితల వాతావరణంలో చోటు చేసుకుంటోన్న మార్పులు, తేమతో కూడుకుని ఉన్న పెనుగాలుల ప్రభావం.. భారీ వర్షాలకు కారణం కానున్నట్లు తెలిపింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Recommended Video
జంట తుఫాన్ల బారిన పడి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి సహా రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. నివర్, బురేవి తుఫాన్ల దాడి ధాటికి వేల రూపాయల మేర పంటనష్టం సంభవించింది. మళ్లీ అవే ప్రాంతాల్లో మరో రౌండ్ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లతో పాటు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, ఏపీ దక్షిణ ప్రాంత కోస్తా జిల్లాలు, యానాంలల్లో ఈ నెల 22వ తేదీ వరకు దశలవారీగా భారీ వర్షాలు పడతాయని అభిప్రాయపడ్డారు.
కరైకల్, రామనాథపురం, తెన్కాశిల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిల్లో 17 నుంచి 22 తేదీ మధ్య ఈ భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. క్రమంగా అవి మరింత విస్తరిస్తాయని, అటు కేరళ, ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలకు కారణమౌతాయని అంచనా వేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. దేశ రాజధానిలో అత్యల్పంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. ఈ సీజన్లో ఇదే అత్యల్పమని పేర్కొన్నారు. మున్ముందు.. ఉష్ణోగ్రత మరింత తగ్గుతుందని చెప్పారు.
పంజాబ్, హర్యారా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లల్లో వచ్చే 48 గంటల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గుతుందని అంచనా వేశామని అన్నారు. శుక్ర, శనివారాల్లో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, కీలాంగ్, కల్ప, లాహౌల్-స్పితిల్లో ఉష్ణోగ్రత సున్నా స్థాయికి పడిందని, మైనస్లోకి వెళ్లొచ్చనీ పేర్కొన్నారు. రాజస్థాన్లోని చురు ప్రాంతంలో 5.2, పిలానీలో 5.3 ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో మైనస్ 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఢిల్లీలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.