రెడ్ అలర్ట్ : కేరళను ముంచెత్తిన వరదలు..25 మంది మృతి పలువురు గల్లంతు
Recommended Video
కేరళ/మహారాష్ట్ర/ కర్నాటక: దేశంలో చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని వరదలు వీడటం లేదు. ఏపీ, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో వరదలు విలయతాడవం చేస్తున్నాయి. తాజాగా కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ఇప్పటికే వరదల ధాటికి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు. అంతేకాదు పశ్చిమ తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
గుజరాత్ కేరళ గోవా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్ తీరం వెంబడి రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొంది.ఇప్పటికే ఈ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఇక రానున్న రెండ్రోజుల్లో కురిసే భారీ వర్షాలకు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక భారీ వర్షాలతో పాటు అరేబియన్ సముద్రం తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని సూచించింది.
#WATCH: A cow stuck in flood being rescued by National Disaster Response Force (NDRF) team in Kamshet, Pune. #Maharashtra pic.twitter.com/VF7Ko7z05v
— ANI (@ANI) August 4, 2019
కేరళలో వరదలు విలయతాండవం
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు 25 మంది మృతి చెందారు. ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది కేరళ సర్కార్. రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆర్మీ ఎయర్ఫోర్స్ సహాయాన్ని కోరారు. ఇక వాయనాడ్లో ఇప్పటి వరకు 260 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. ఇప్పటికే రహదారులు ధ్వంసం అయ్యాయి. కొండచరియలు విరిగి పడుతుండటంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాయనాడ్ను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఇప్పటికే ఎయిర్ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్స్ను మొదలు పెట్టాయి.
ప్రమాదస్థాయి మించి ప్రవహిస్తున్న నదులు
భారీ వర్షాల కారణంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. పార్కింగ్ ప్రాంతంలోకి వరదనీరు చేరడంతో విమానాలను అధికారులు రద్దు చేశారు. ఆదివారం 3 గంటలవరకు విమానసర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ప్రస్తుతానికి కొచ్చి నేవల్ ఎయిర్బేస్ను వినియోగించుకోవచ్చంటూ పినరాయి విజయన్ పేర్కొన్నారు. కేరళలో 44 నదులు ఉంటే అందులో సగం నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే దాదాపు చాలా డ్యాములు నిండిపోయాయని పేర్కొన్నారు. 20వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో వరదల ధాటికి 27 మంది మృతి
ఇక మహారాష్ట్రలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇప్పటి వరకు వరదల దాటికి 2.05 లక్షల మంది ప్రజల జాడ కనిపంచడం లేదు. 27 మంది మృతి చెందారు.కొల్హాపూర్, సంగ్లిలో వరద ఉధృతి కాస్త తగ్గినప్పటికీ డ్యాములు నిండటంతో అక్కడి నుంచి వస్తున్న వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచేస్తోంది. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో 30వేల నుంచి 35 వేల ప్రజలు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఎదురుచూస్తున్నారు. కర్నాటక 5లక్షల క్యూసెక్కుల నీటిని ఆల్మటీ డ్యామ్ నుంచి విడుదల చేస్తే పరిస్థితి కాస్త కుదుటపడే అవకాశం ఉంటుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. పరిస్థితి మారకపోతే దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కూడా వెనకాడబోమని ఫడ్నవీస్ తెలిపారు.
కర్నాటకలో ఉదృతంగా ప్రవహిస్తున్న నదులు
కర్నాటకలో కూడా పరిస్థితి బాగా దెబ్బతింది. ఇప్పటి వరకు తీరప్రాంత జిల్లాల్లో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇందులో ఏడుగురు మంది బెలగావికి చెందినవారున్నారు.రహదారులు పూర్తిగా దెబ్బతినడం, రైలు కనెక్టివిటీ కూడా ధ్వసం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బెలగావి జిల్లాలోని దూద్గంగా నది తీరంలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు బెలగావి, రాయిచూర్, బాగల్కోట్ జిల్లాలో మోహరించాయి.