రెడ్ అలర్ట్: భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం, స్కూళ్లు బంద్, మత్స్యకారులకు వార్నింగ్
చెన్నై: కేరళతోపాటు తమిళనాడులోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
రెడ్ అలర్ట్: మరోసారి కేరళ, తమిళనాడు, పాండిచ్చేరికి తుఫాను ముప్పు, భారీ వర్షాలు
ఆ రెండ్రోజుల్లో భారీ వర్షాలు
అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు(అక్టోబర్ 6,7తేదీల్లో) రోజుల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. అక్టోబర్ 7వ తేదీన అత్యంత భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. ఆ తర్వాత మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, తమిళనాడులో 7వ తేదీన అత్యంత భారీ వర్షం పడొచ్చన్న అంచనాలతో ‘రెడ్ అలర్ట్' ప్రకటించారు. తక్కువ సమయంలో అత్యధిక వర్షం కురవడాన్నే ‘రెడ్ అలర్ట్'గా వ్యవహరిస్తుంటారు. ఆ రోజు సుమారు 25 సెం.మీల వర్షపాతం నమోదు కావొచ్చని విపత్తు నిర్వహణ విభాగం సంచాలకులు సత్యగోపాల్ తెలిపారు.
హై అలర్ట్
ముందస్తు హెచ్చరిక పనులు చేపట్టాలని, సహాయక శిబిరాలు సిద్ధంగా ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విపత్తు నిర్వహణ విభాగం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు జాగత్ర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాలు జారీచేశారు. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షదీవుల ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం అల్పపీడనంగా మారనుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు
రానున్న 48 గంటల తర్వాత అది తుపానుగా మారి వాయువ్య దిశగా కదలనుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉపరిత ఆవర్తన ప్రభావంతో తమిళనాడుతో పాటు పుదుచ్చేరితోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు, వరదలు..
చెన్నైతో పాటు రాష్ట్రంలోని పుదుకోట్టై, తిరుచ్చి, తంజావూరు, ధర్మపురి, శివగంగై, దిండుకల్, మదురై, నామక్కల్, తిరువారూర్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీవర్షం కురిసింది. పశ్చిమ కనుమల్లోని కొడైకెనాల్ కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెరియకుళం సమీపాన కుంభకరై జలపాతంలో వరద పోటెత్తింది. వేలూరు జిల్లాలో అరక్కోణం, కాంచీపురం జిల్లాలో తిరుపోరూర్, కాంచీపురం, కల్పాక్కం, మహాబలిపురం తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువారూర్, పుదుకోట్టై, నాగపట్నం, సేలం, కడలూరు జిల్లాల్లోని పాఠశాలలకు గురువారం సెలవు ఇచ్చారు. పుదుచ్చేరిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
మత్స్యకారులకు హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఉద్ధృతమైన గాలులు వీయడంతో సముద్రం కల్లోలంగా మారింది. దీంతో రామేశ్వరం, మండపం, పాంబన్ తదితర ప్రాంతాలకు చెందిన జాలర్లు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో మత్య్సకారులు, జాలర్లు సముద్రంపై వేటకు వెళ్లలేదు. బలమైన గాలుల కారణంగా రామేశ్వరంలోని పాంబన్ వంతెనపై రైళ్లను తక్కువ వేగంతో నడుపుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరో వైపు కేరళ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే వర్షాలు, వరదలతో భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని చూసిన ప్రజలు ప్రస్తుత వర్షాలతో భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం, అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. సహాయక బృందాలను పంపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.