రానున్న 48 గంటల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: భారత వాతావరణశాఖ హెచ్చరిక
ఢిల్లీ : కేరళలో కురిసిన భారీ వర్షాలు తద్వారా వచ్చిన వరదలు మరువక ముందే భారత వాతావరణ శాఖ మరో తీవ్ర హెచ్చరిక జారీచేసింది. బుధవారం నుంచి దేశంలోని పలు రాష్ట్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భా, ఛత్తీస్ఘడ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయా, గుజరాత్, మధ్య మహరాష్ట్ర, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బుధవారం నుంచి రానున్న ఐదురోజులు అంటే ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 2వరకు ఈ భారీ వర్షాలుకు కురుస్తాయని చెప్పారు. తూర్పు ఉత్తర్ ప్రదేశ్లోని మారుమూల ప్రాంతాల్లో ఆగష్టు 30న భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగష్టు 31న ఉత్తర్ ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సెప్టెంబర్ 1న తూర్పు ఉత్తర్ ప్రదేశ్, ఒడిషా, నాగాలాండ్, మణిపూర్ , మిజోరాం, త్రిపురాలో కురుస్తాయని వివరించిన వాతావరణ అధికారులు... సెప్టెంబర్ 2న తూర్పు ఉత్తర్ ప్రదేశ్, ఒడిషా, నాగాలాండ్, మణిపూర్ మిజోరాం త్రిపురాలో కురుస్తాయని చెప్పారు.
Recommended Video
సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. జమ్ము కశ్మీర్, పశ్చిమ రాజస్థాన్, పంజాబ్, హర్యాణా, చంఢీఘఢ్, ఢిల్లీ మినహాయిస్తే దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. దక్షిణ భారతంలో కూడా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఉత్తర ఒడిషాలోని మారుమూల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో మధ్యప్రదేశ్, విదర్భా, ఛత్తీస్ఘడ్లలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దక్షిణ గుజరాత్ పై తుఫాను ప్రభావం కనిపిస్తోందని వెదర్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. సముద్ర తీరంలో తుఫాను బలపడుతోందని దీని ప్రభావంతో గోవా, కొంకణ్, మధ్యమహారాష్ట్రల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.