బై పోల్కు రెయిన్ ఎఫెక్ట్: పోలింగ్ కేంద్రంలోకి వర్షపు నీరు..ఆరెంజ్ అలర్ట్ జారీ
కొచ్చి: కేరళలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 12 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఎర్నాకులం ఉపఎన్నికకు వరుణుడు అడ్డంకిగా మారాడు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లోకి వర్షపు నీరు రావడంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉదయం నుంచి గ్యాప్ ఇవ్వకుండా భారీ వర్షం పడుతుండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దగా ఓటర్లు కనిపించలేదు.
ఎర్నాకులంలో భారీ వర్షాలు
కేరళను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొల్లాం, అలపుజా, ఎర్నాకులం, పతనంతిట్టాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించింది. వారు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సీఎం పినరాయి విజయన్ తెలిపారు. పరిస్థితిని అతి దగ్గరగా సమీక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక అధికారులు చెప్పే సూచనలను పాటించాలని, ఇంటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తే వారి మాట విని ప్రజలు సహకరించాలని విజయన్ కోరారు.
పోలింగ్ కేంద్రాల్లోకి వర్షపు నీరు
ఇక ఎర్నాకులం కొన్ని నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి ఎర్నాకులంలో 4.9శాతం పోలింగ్ నమోదవగా.. కొన్ని నియోజకవర్గంలో 11.5శాతం పోలింగ్ నమోదైంది. ఇక మిగతా మూడు నియోజకవర్గాలైన వటియూర్కావులో 11.5శాతం, ఆరూర్లో 12.8శాతం, మంజేశ్వరంలో 16.5శాతం ఉదయం 9 గంటలకు నమోదైంది. ఎర్నాకులం అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు పోలింగ్ కేంద్రాన్ని మార్చడం జరిగింది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకే తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే పోలింగ్ సమయంను కూడా పొడిగిస్తామని కేరళ రాష్ట్ర సీఈసీ తుకారాం మీనా చెప్పారు.
ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఓటు వేయకుండా ఉండలేదని చెప్పింది 78 ఏళ్ల నన్. పోలింగ్ రోజున ఇంత భారీ వర్షం కురవడం తను తొలిసారిగా చూస్తున్నట్లు చెప్పింది. పోలింగ్ కేంద్రంలోకి నీళ్లు వచ్చినప్పటికీ నన్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఎర్నాకులం నుంచి బయలుదేరాల్సిన రైళ్లు స్టేషన్కే పరిమితమయ్యాయి.ఈ మార్గం ద్వారా ప్రయాణించే అన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని రైల్వేశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.