ఉత్తర్ప్రదేశ్లో భారీ వర్షాలు: పిడుగుపాటుకు ఒక్కరోజులోనే 32 మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్ : ఉత్తర్ ప్రదేశ్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు తోడు పిడుగులు పడటంతో ఆయా ప్రాంతాల్లో కలిపి మొత్తం 32 మంది మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఇక జూలై 18 మరియు 20న కురిసిన వర్షాలకు ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు పాము కాటుకు బలయ్యారు.ఇక ఆదివారం పిడుగుపాటుకు కాన్పూర్, ఫతేపూర్లలో ఏడుగరు చొప్పున మృత్యువాత పడగా.. ఝాన్సీలో 5 మంది మృతి చెందారు. నలుగురు జలాన్లో ముగ్గురు హమీర్పూర్లో ఇద్దరు ఘాజీపూర్లో ఒకరు జాన్పూర్, ప్రతాప్గఢ్లో ఒకరు , కాన్పూర్ దేహాత్, చిత్రకోట్లలో ఒక్కొక్కరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
పిడుగుపాటుకు మృతి చెందినవారికి యూపీ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. పిడుగుపాటుకు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా వైద్యులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే ఆదివారం రోజున పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాదు కర్నాటక, తమిళనాడు, పుదుచేరి, కారైకల్, తెలంగాణ , మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో సోమవారం రోజున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. గోవాతో సహా కొంకణ్ తీరంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. కేరళలో ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాసర్గడ్, ఇడుక్కి, కన్నూరు, వాయనాడ్, కోజికోడ్, మల్లాపురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది కేరళ సర్కార్. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని అంచనాకు వచ్చినప్పుడు ఈ రెడ్ అలర్ట్ హెచ్చరికలు అధికారులు జారీ చేస్తారు. అంటే దీనర్థం ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించాలని అర్థం. లోతట్టు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంలాంటి జాగ్రత్తలు పాటించాలని అర్థం.