కేరళపై కన్నెర్ర చేసిన వరణుడు... భారీ వర్షాలకు 20 మంది మృతి
దేవుని సొంత దేశం కేరళపై వరుణదేవుడు కన్నెర్ర చేశాడు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు 20 మంది మృతి చెందారు. ఇప్పటికే భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా పడుతున్న వానలకు అక్కడి డ్యాములు నిండిపోయాయి. ఇడుక్కి డ్యామ్లోకి వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు ఆ గేట్లను ఎత్తివేశారు. అంతకంటే ముందు కొచ్చి విమానాశ్రయంలో అన్ని విమానాల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం వచ్చే విమానాలు అన్నిటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
చెరుతోని డ్యామ్ నుంచి నీరు విడుదలైతే పెరియార్ నదిలో వాటర్ లెవెల్ పెరిగిపోతుందని అంచనా వేశారు అధికారులు. ఇదిలా ఉంటే ఇడుక్కి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 11 మంది మృతి చెందారు. మల్లాపురంలో 6 మంది చనిపోగా.. కోజికోడ్లో ఇద్దరు, వాయనాడ్లో ఒక్కరు మృతి చెందారు. పాలక్కడ్, వాయనాడ్, కోజికోడ్లలో చాలామంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఎర్నాకులంలో రిలీఫ్ క్యాంప్స్ను ఏర్పాటు చేసిన అధికారులు . వరదల ధాటికి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇడుక్కిలోని ఆదిమలి టౌన్లో మృతిచెందగా... మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
లోతట్టు ప్రాంతాల్లో వరదలు ఉధృతమవుతుండటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. కోజికోడ్లో ఈ సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయి. ఇంకా రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావాలని కేంద్రాన్ని కోరింది కేరళ ప్రభుత్వం . ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా గత రెండు మూడు వారాల్లోనే 22 డ్యాములకు సంబంధించిన గేట్లను అధికారులు ఎత్తివేశారు. 26 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇడుక్కి డ్యామ్ గేట్లను ఎత్తివేశారు అధికారులు.
ఇప్పటికే ఆర్మీ,నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సహాయకచర్యలు చేపట్టాల్సిందిగా కోరినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చెప్పారు. కోజికోడ్, వాయనాడ్, పాలక్కడ్, ఇడుక్కి, మల్లాపురం, కొల్లాం జిల్లాల్లో స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు విజయన్ తెలిపారు. అలపుజాలో జరిగే బోట్ రేసును కూడా భారీ వర్షాల కారణంగా వాయిదా వేశారు.