భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం.. ఎక్కడి రైళ్లు అక్కడే.. స్కూళ్లు, కాలేజీలు బంద్
మహానగరం ముంబై భారీ వర్షాలకు స్తంభించిపోయింది. మంగళవారం కురిసిన వర్షం వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. బుధవారం కూడా భారీ స్థాయిలో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ముంబై: మహానగరం ముంబై భారీ వర్షాలకు స్తంభించిపోయింది. మంగళవారం కురిసిన వర్షం వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. బుధవారం కూడా భారీ స్థాయిలో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
ముంబై నగరంలోని వీధులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. రానున్న 24 గంటల్లో ముంబైకి సమీపంలో ఉన్న రాయిగడ్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశాలున్నాయి. ఇంత వర్షపాతం ఎక్స్ట్రీమ్ వెదర్ కిందకు వస్తుందని వాతావరణశాఖ వెల్లడించింది.
మూడు గంటల్లోనే 100 మిల్లీమీటర్లు...
ముంబైలో మంగళవారం రాత్రి 11.30 నిమిషాల వరకు సుమారు 225.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఇంత వర్షపాతం ఎక్స్ట్రీమ్ వెదర్ కిందకు వస్తుందని వాతావరణశాఖ వెల్లడించింది. కేవలం సాయంత్రం 5.30 నుంచి 8.30 మధ్య కేవలం మూడు గంటల వ్యవధిలో సుమారు 100 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ నెలలో ఇదే అత్యధికం...
ముంబైలో ఈ నెలలో గత 12 గంటల్లోనే అత్యధిక వర్షంపాతం మంగళవారమే నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నారీమన్ పాయింట్, వర్లీ, చెంబుర్, ములంద్, అందేరీ, బాంద్రా, బొరివ్లీ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది.
స్కూళ్లు, కాలేజీలు, రన్ వే మూసివేత...
స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముంబై ఎయిర్పోర్ట్లోని ప్రధాన రన్వేను కూడా మూసివేశారు. ప్రస్తుతం సెకండ్ రన్వేను వాడుతున్నారు. మొత్తం 56 విమానాలను డైవర్ట్ చేశారు.
ఎక్కడి రైళ్లు అక్కడే...
మంగళవారం రాత్రి సబర్బన్ రైళ్లు ఎక్కడిఎక్కడే నిలిచిపోయాయి. బుధవారం మధ్యాహ్నం మళ్లీ వర్షం భారీగా కురిసే అవకాశాలు ఉన్న కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశారు. పశ్చిమ రైల్వే మొత్తం ఆరు రైళ్లను రద్దు చేసింది. మరో రెండు రైళ్లను సెంట్రల్ రైల్వే రూట్లో దారి మళ్లించారు.
డబ్బావాలాలు సైతం...
ముంబైలో భారీ వర్షాల దెబ్బకు ఫేమస్ డబ్బావాలాల విధులకు కూడా ఆటంకం కలిగింది. వాళ్లు కూడా వర్షం కారణంగా తాము తమ విధులకు హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారు. భారీ వర్షాల వల్ల బుధవారం డబ్బాలు సరఫరా చేయలేమని డబ్బావాలాల సంఘం ప్రతినిధి సుభాష్ తాలేకర్ పేర్కొన్నారు.