మరో రెండు రోజులు కుమ్మేసుడే: ఏపీ సహా మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Recommended Video
విశాఖపట్నం: ఈ ఏడాది వర్షాకాలం సీజన్.. చిరస్మరణీయంగా మిగిలిపోవచ్చు. అనంతపురం వంటి తీవ్ర వర్షాభావ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లేలా వానలు కురిశాయి. ఈ జిల్లాలో ఖాళీగా ఏ ఒక్క చెరువూ లేదు. అన్ని అలుగు పారుతున్నాయి. కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం రిజర్వాయర్ ఈ సీజన్ లో ఆరుసార్లు నిండింది. నిండిన ప్రతీసారీ గేట్లను ఎత్తారు అధికారులు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా శ్రీశైలం మిగులు జలాలను రాయలసీమలోని గండికోట, మైలవరం రిజర్వాయర్లకు తరలించారు. అవి కూడా గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. పెన్నానదిపై నెల్లూరు జిల్లాలో నిర్మించిన సోమశిల ప్రాజెక్టు గేట్లను ఎత్తారంటే ఈ సారి వర్షాలు ఏ స్థాయిలో కురిశాయో అర్థం చేసుకోవచ్చు.
తీరు ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వర్షాకాలం చివరి దశలోనూ భారీగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రత్యేకించి ఏపీ, తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. కేరళ ఉత్తర ప్రాంతం, కర్ణాటక దక్షిణాది జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో 12 గంటలుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి.
తమిళనాడులో పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు..
ఫలితంగా కొన్ని జిల్లాల్లో పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కోయంబత్తూరు, కన్యాకుమారి, శివగంగ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఆయా చోట్ల పాఠశాలలకు సెలవును ప్రకటించారు. వచ్చే అయిదు రోజుల పాటు తమిళనాడులోని నీలగిరి, కోయంబత్తూరు, థేని, దిండిగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉంది. ధర్మపురి, సేలం, కృష్ణగిరి, రాయవేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.
కేరళ, కర్ణాటకలో ఇదే పరిస్థితి..
కన్యాకుమారి, తిరునెల్వేలి, ట్యుటికోరిన్, నాగపట్టిణం, తిరువరూర్, పుదుక్కోట్టై, తంజావూరు, కడలూరు, విల్లుపురం, కంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల్లో సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కేరళలోని తిరువనంతపురం, అళప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాల్లో ఇప్పటికే కుండపోతగా వర్షం కురుస్తోంది. ఫలితంగా- ఆయా జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్ లను జారీ చేశారు. కర్ణాటకలో బాగల్ కోటె, శివమొగ్గ, హవేరి జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా మారుమూల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
కృష్ణాకు మళ్లీ వరద?
ధార్వాడ, బెళగావి, కలబురగి, గదగ్, విజయపుర, బాగల్ కోటె, చిక్ మగళూరు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరో 48 గంటల్లో ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా జిల్లాల పాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కృష్ణానది తీర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఫలితంగా- కృష్ణానదికి మరోసారి వరద వచ్చే అవకాశాలు లేకపోలేదని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి ఏ మాత్రం వరద వచ్చినా తెలంగాణలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తేయడం ఖాయంగా కనిపిస్తోంది. దాని ప్రభావం మరోసారి శ్రీశైలం రిజర్వాయర్ పై పడుతుంది.