ఉత్తరం..అతలాకుతలం! మూడు రాష్ట్రాల్లో అకాల వర్షాలు..35 మంది మృతి!
న్యూఢిల్లీ: అకాల వర్షాలు మూడు రాష్ట్రాల్లో బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సంభవించిన భారీ వర్షాలు ప్రాణాలను బలిగొన్నాయి. పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టాలను మిగిల్చాయి. జడివానల ధాటికి వేర్వేరు ప్రాంతాల్లో 35 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. చాలాచోట్ల ఆస్తినష్టం సంభవించింది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్, గుజరాత్ లల్లో బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు చివురుటాకులా వణికిపోతున్నారు అక్కడి ప్రజలు. భారీ వర్షాలు మిగిల్చిన విషాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. నష్ట పరిహారాన్ని ప్రకటించారు.
వైఎస్ జగన్ ను తల లేని కోడితో పోల్చిన నారా లోకేష్
అకాల వర్షం..
రాజస్థాన్లోని చిత్తోర్గఢ్, శ్రీగంగానగర్, అజ్మీర్, కోట, పిలానీ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ఈదురుగాలులు తోడయ్యాయి. ఫలితంగా భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఫలితంగా- తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. శ్రీగంగానగర్, కోట, పిలానీ వంటి ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గుజరాత్, మధ్యప్రదేశ్లలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మధ్యప్రదేశ్లో 16, గుజరాత్లో 10. రాజస్థాన్లో తొమ్మిది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. గుజరాత్ లోని సబర్కాంత జిల్లా హిమ్మత్ నగర్ లో ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. దీనికోసం వేసిన బహిరంగ సభ ఏర్పాట్లన్నీ చిందర వందర అయ్యాయి. బహిరంగ సభ వేదిక కుప్పకూలింది. ఈదురు గాలులకు టెంట్లు ఎగిరిపోయాయి.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు..
గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వర్షాలపై ప్రధాని మోడీ స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని అప్రమత్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50 వేల రూపాయలచొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు. తుపాను ప్రభావిత ప్రజలకు ఆదుకుంటామని అన్నారు. అకాల వర్షంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన సంతాపం తెలియజేశారు.