రెడ్ అలర్ట్: ఢిల్లీకి భారీ వర్ష సూచన... గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు కొన్ని రోజుల తరబడి కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది కేంద్ర వాతావరణశాఖ. ఢిల్లీ నగరాన్ని మబ్బులు కమ్మేస్తాయని ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇప్పటి వరకు ఢిల్లీ నగరం ఎన్నడూ చూడని సుధీర్ఘ వర్షాలు కురుస్తాయని ప్రెవేట్ వాతావరణ శాఖ అధికారి మహేష్ పల్వత్ చెప్పారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేందుకు వాతావరణ శాఖ కలర్ కోడ్స్ను జారీ చేస్తుంది. అంటే వర్షాల వల్ల ఏ స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉందో అనేది ముందుగానే అంచనా వేసి ఆ క్రమంలో ఒక్కో రంగు ఒక్కో స్థాయి ప్రమాదంను తెలియజేసేలా కలర్ కోడ్ను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రాణ ఆస్తి నష్టం అత్యంత ప్రమాదకర స్థాయిని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ను జారీ చేస్తారు. ప్రస్తుతం ఢిల్లీకి ఆ ముప్పు పొంచి ఉందని భావించిన వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను జారీ చేసింది.
ఇక నారింజ రంగు (ఆరెంజ్ కలర్) అలర్ట్ను జారీ చేశారంటే అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేయటం. ఇక గురువారం శుక్రవారం కురిసే వర్షాలతో వాతావరణం చల్లబడుతుందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ప్రస్తుతం దక్షిణ ఢిల్లీలో పడుతున్న వర్షాలు క్రమంగా ఉత్తర ఢిల్లీలో కూడా కురుస్తాయని అయితే ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. ఇక జూలై 1 నుంచి జూలై 23 వరకు ఢిల్లీలో 156.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత 30 ఏళ్ల సరాసరి వర్షపాతంతో పోలిస్తే 4శాతం ఎక్కువని అధికారులు చెప్పారు. ఇక ఒక్క ఢిల్లీ నగరంలోనే 50.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అదే ఇప్పటి వరకు అత్యధిక వర్షపాతంగా రికార్డు అయ్యిందని తెలిపారు. ఈ స్థాయిలో వర్షం జూలై 22న కురిసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్లలో కూడా జూలై 27 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూలై 25 మరియు 26న అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.