ముంబైలో భారీ వర్షాలు కారణంగా 11 విమానాలు రద్దు..మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి
ముంబై: ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం 11 విమానాలు రద్దు కాగా మరో మూడు విమానాలను దారి మళ్లించారు అధికారులు.ప్రస్తుతం ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆపరేషన్స్కు కాస్త అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజబులిటీ ఉండాల్సిన దానికన్నా తక్కువగా పడిపోవడంతో రన్వేను 20 నిమిషాల పాటు మూసివేయడం జరిగింది. దీంతో 11 విమానాలను రద్దు చేసినట్లు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
ఇక రద్దయిన విమానాల్లో దేశీయ ప్రైవేట్ విమానాయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానం రద్దయిన సర్వీసుల్లో ఉంది. ఉదయం 9 గంటల 12 నిమిషాలకు ఆపరేషన్స్కు అంతరాయం ఏర్పడిందని ఆ తర్వాత 9గంటల 31 నిమిషాలకు తిరిగి సేవలు పునరుద్ధరించడం జరిగిందని ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. రద్దయిన 11 విమానాల్లో ఎనిమిది విమానాలు ముంబై విమానాశ్రయం నుంచి బయలు దేరాల్సి ఉండగా... మూడు విమానాలు ఎయిర్పోర్టులో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఇక భారీ వర్షాల ప్రభావం బస్సులపై రైల్వేలపై కూడా పడటంతో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది.
ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైన వర్షం ఒక్క ముంబై నగరంలోనే 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో రైల్వే ట్రాక్పై వర్షం నీరు నిలిచిపోయింది. ఇక భారీ వర్షాలు మరో రెండురోజుల పాటు నగరాన్ని ముంచెత్తే అవకాశం ఉన్నందున ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణశాఖ.