రాజ్కోట్లో నరేంద్ర మోడీకి గుడి, రోజు ఉదయం ప్రార్థనలు
రాజ్కోట్: గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో ప్రధాని నరేంద్ర మోడీకి అభిమానులు, పార్టీ కార్యకర్తలు గుడి కట్టారు. ఈ గుడిని చూసేందుకు పక్క గ్రామాలకు చెందిన వారు కూడా తరలి వస్తున్నారు. ఈ గుడిని కట్టేందుకు రెండేళ్లు సమయం పట్టిందని తెలుస్తోంది.
ఈ గుడిలో తొలుత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోగ్రాఫ్ పెట్టారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచిన అనంతరం ఈ గుడికి ప్రాధాన్యత మరింత పెరిగింది.
ఈ గుడి కోసం రమేష్ ఉన్హద్ అనే అభిమాని డబ్బులు ఇచ్చారు. ప్రధాని మోడీ విగ్రహం తయారు చేసేందుకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ విగ్రహం ఖరీదు రూ.1.65 లక్షలు. మోడీ విగ్రహం తయారీకు తాము పలువురిని సంప్రదించామని, చాలామంది అచ్చం మోడీలా తయారు చేయలేకపోయారని, అనంతరం తాము ఒడిశా నుండి ఓ చిత్రకారుడిని పిలిపించామని, అతను మోడీలా ఉండే ప్రతిమ తయారు చేశారని రమేష్ ఉన్హద్ చెప్పారు.
మోడీ అభిమానులు అతనిని మరో సర్ధార్ వల్లభాయ్ పటేల్లా భావిస్తారని చెప్పారు. ఆ గ్రామ పెద్ద మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో కూడా ఇలా మోడీ విగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. ఈ మోడీ గుడిలో ప్రతి ఉదయం ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థనలకు గ్రామస్తులతో పాటు పక్క ఊరి వారు కూడా తరుచూ వస్తుంటారు. కాగా, ఈ గుడిని అధికారికంగా ఈ నెల 15వ తేదీన మంత్రి మోహన్ బాయి కల్యాణ్జీబాయి కుందారియా ప్రారంభించనున్నారు.