కేదార్ నాథ్ లో తప్పిన పెను ప్రమాదం: హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్!
డెహ్రాడూన్: దేవభూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. టేకాఫ్ తీసుకున్న వెంటనే.. హెలికాప్టర్ లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీనితో అది కొన్ని అడుగల ఎత్తు నుంచి కింద పడింది. క్రాష్ ల్యాండింగ్ కు గురైంది. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో హెలికాప్టర్ లో ఆరుమంది భక్తులు ఉన్నారు. స్వల్ప గాయాలతో వారు బయట పడగలిగారు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
యూటీ ఎయిర్ అనే సంస్థ కొంతకాలంగా భక్తుల కోసం హెలికాప్టర్ ద్వారా ప్యాకేజీ ట్రిప్ లను నడిపిస్తోంది. కేదార్ నాథ్-ఫాటా మధ్య ఈ హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉదయం 11:25 నిమిషాల సమయంలో ఆరుమంది భక్తులు కేదార్ నాథ్ నుంచి ఫాటాకు బయలుదేరి వెళ్లడానికి యూటీ ఎయిర్ హెలికాప్టర్ లో టికెట్లను కొనుగోలు చేశారు. కేదార్ నాథ్ లో ఈ ఆరుమందిని ఎక్కించుకుని ఫాటాకు బయలుదేరడానికి టేకాఫ్ తీసుకున్న క్షణాల వ్యవధిలో హెలికాప్టర్ అదుపు తప్పింది. సాంకేతిక లోపం తలెత్తింది.
దీనితో పైలెట్ దీన్ని సురక్షితంగా హెలిప్యాడ్ లో దించడానికి ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్ పెద్ద శబ్దం చేస్తూ క్రాష్ ల్యాండింగ్ కు గురైంది. హెలికాప్టర్ తోక భాగం ముందుగా నేలకు తాకింది. ఒక వైపునకు ఒరిగిపోయింది. హెలికాప్టర్ లో ఉన్న ఆరు మంది భక్తులు, పైలెట్ సురక్షితంగా బయట పడ్డారు. భక్తుల్లో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.