బొంబాయిలో అంతే ..! డ్రైనేజీలో కోటీశ్వరుడు !
ముంబై: కాళ్లకైనా, కార్లకైనా సడక్ ఒక్కటే, పారిశుద్ధ్య కార్మికులకైనా, కోటీశ్వరులకైనా మ్యాన్ హోల్ ఒక్కటే.. అని నిరూపించిన ఘటన ఇది. ఖరీదైన కారును పార్క్ చేసి, రోడ్డు మీద నడుచుకుంటూ షాపింగ్ మాల్ కు వెళ్లారో కోటీశ్వరుడు. అలాంటిలాంటి కోటీశ్వరుడు కాదు. సింగపూర్ ప్రధాన కేంద్రంగా, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న హీలియస్ క్యాపిటట్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. పేరు సమీర్ అరోరా.
నడుచుకుంటూ షాపింగ్ మాల్ కు వెళ్లడంలో విశేషమేమీ కాదు. చెప్పుకోదగ్గ వార్త కాదు గానీ.. అలా వెళ్తూ, వెళ్తూ తెరచి ఉన్న మ్యాన్ హోల్ లో దభేల్ మంటూ పడిపోయారు. మ్యాన్ హోల్ ఎలా ఉంటుందో తెలుసుగా! మానవ వ్యర్థాలతో నిండుగా ఉన్న మ్యాన్ హోల్ లో అది. అరోరా పడిపోయిన దృశ్యాన్ని చూసిన వెంటనే.. స్థానికులు స్పందించారు. ఆయనను పైకి లాాగారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లోయర్ పరేల్ ప్రాంతంలోని ఫీనిక్స్ మిల్స్ మాల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాన్ హోల్ లు మానవ వ్యర్థాల మధ్య ఛాతీ వరకు ఆయన కూరుకుపోయారు.
Thank you Neeraj. It was scary as hell (and smelly). Was within micro seconds of disappearing. Quick reflexes and shape of manhole gave me second life.
— Samir Arora (@Iamsamirarora) April 26, 2019
Guys and gals- be careful in life and remain safe. Yeh hai Mumbai meri jaan and was close to taking my jaan. https://t.co/6RX3M2GatS
తాను మ్యాన్ హోల్ లో పడిపోయిన విషయాన్ని సమీర్ అరోరా.. ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్ని సెకెన్ల పాటు తన కళ్ల ముందు ఏమీ కనిపించలేదని అన్నారు. ఛాతీ వరకు మానవ వ్యర్థాలతో నిండి పోయిన జలాల్లో కూరుకుపోయానని, స్థానికులు తనను రక్షించారని చెప్పుకొచ్చారు. దుర్గంధాన్ని భరించలేకపోయానని, నరకం కనిపించిందంటూ ఆయన ట్వీటారు. మ్యాన్ హోల్ లో పడ్డప్పుడు తన ఖరీదైన మొబైల్ ఫోన్ అందులోనే ఉండిపోయిందని, బృహన్ ముంబై కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులకు దొరికతే.. తన కానుకగా ఉంచుకోవచ్చని అన్నారు. ఓ రకంగా తనకు మ్యాన్ హోల్ పునర్జన్మ ఇచ్చిందని చెప్పారు. మ్యాన్ హోళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన స్థానికులకు సూచించారు.
ఈ ఘటనపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. సమీర్ అరోరా ట్వీట్ ను చూసిన వెంటనే అక్కడి అధికారులు.. ఆ మ్యాన్ హోల్ పై మూతను ఏర్పాటు చేశారు. మూసివేసిన మ్యాన్ హోల్ ఫొటో తీసి, దాన్ని అరోరాకు రీట్వీట్ చేశారు.
వర్షాకాలం సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాన్ హోళ్లు ప్రాణాంతకమే. పలువురు పాదాచారులను మింగేసిన ఘనత మ్యాన్ హోళ్లకు ఉన్నాయి. హైదరాబాద్ లో ఓ మహిళా బ్యాంక్ మేనేజర్ మ్యాన్ హోల్ లో పడి ప్రాణాలను కోల్పోయిన విషయం గుర్తుండే ఉంటుంది. 2017లో ముంబైలో ప్రముఖ డాక్టర్ ఒకరు మ్యాన్ హోల్ లో పడి దుర్మరణం పాలయ్యారు. రెండు రోజుల తరువాత ఆమె మృతదేహం చాదర్ ఘాట్ వద్ద నాలాలో తేలింది. వర్షపు నీరు నడిరోడ్డును ముంచెత్తిన సమయంలో.. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందనే విషయం ఎవరికీ తెలియదు. హడావుడిగా వెళ్తూ, అందులో పడి చాలామంది తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు.