కశ్మీర్కు మంచి రోజులు షురూ..! భారీ పరిశ్రమ నెలకొల్పబోతున్న స్టీల్ బర్డ్ హెల్మెట్స్ సంస్థ!
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రానికి కేంద్ర పాలిత హోదా కట్టబెడుతూ కేంద్ర తీసుకున్న విప్లవాత్మక చర్యలకు సంబంధించిన సత్ఫలితాలు అప్పుడే మొదలయ్యాయి. ఆర్టికల్ 370 వల్ల ఏర్పడిన ఆంక్షలు ఇకపై తొలగిపోవడం వల్ల జమ్మూ కాశ్మీర్ లో పారిశ్రామిక విప్లవం చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ లో ఎవ్వరైనా ఆ రాష్ట్రంలో భూములు కొనుగోలు చేయడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం లభించింది. పలితంగా- జమ్మూ కాశ్మీర్ వాతావరణానికి, అక్కడి పరిస్థితులకు అనుగుణమైన పరిశ్రమలు ఇక ఇబ్బడి ముబ్బడిగా ఏర్పడబోతున్నాయి.
ఇదసలు భారత దేశమేనా? మా శరీరాన్ని చీల్చారు?: కన్నీరు పెట్టుకున్న ఫరూఖ్ అబ్దుల్లా
స్టీల్ బర్డ్ హెల్మెట్ల తయారీ ఇక జమ్మూ కాశ్మీర్ లో.. 1000 మందికి ఉపాధి..
ప్రముఖ హెల్మెట్ల తయారీ సంస్థ స్టీల్ బర్డ్ హైటెక్.. ఈ సరికొత్త పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. జమ్మూ కాశ్మీర్ లో భారీ ప్లాంట్ ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. ప్రారంభంలో 500 కోట్ల రూపాయల మేర పెట్టుబడితో ఈ హెల్మెట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల 1000 మందికి పైగా స్థానికులకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని, కనీసం 10 వేల మందికి పైగా పరోక్ష ఉపాధిని దొరుకుతుందని స్టీల్ బర్డ్ సంస్థ యాజమాన్యం అంచనా వేసింది. తమతో పాటు మరికొన్ని సంస్థలు జమ్మూ కాశ్మీర్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసిందా సంస్థ యాజమాన్యం.
స్వాగతిస్తున్నాం..
జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని స్టీల్ బర్డ్ హెల్మెట్స్ సంస్థ ఛైర్మన్ సుభాష్ కపూర్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కపూర్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఫలితం.. త్వరలోనే సాక్షాత్కరిస్తుందని చెప్పారు. పలువురు పారిశ్రామికవేత్తలు జమ్మూ కాశ్మీర్ లో తమ పరిశ్రమలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. పెట్టుబడులు పెట్టబోతుండటం తనతోనే ఆరంభం కావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆర్టికల్ 370ని ఎప్పుడెప్పుడు ఎత్తేస్తారా అని తాము ఎదురు చూశామని సుభాష్ కపూర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.
రోజూ 44,500 హెల్మెట్ల తయారీ..
ప్రస్తుతం స్టీల్ బర్డ్ హైటెక్ హెల్మెట్స్ సంస్థ యాజమాన్యానికి హిమాచల్ ప్రదేశ్ లో తయారీ కేంద్రం ఉంది. హిమాచల్ ప్రదేశ్ బడ్డీలో 150 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నెలకొల్పారు. దీన్ని మరింత విస్తరిస్తామని, అదనపు తయారీ కేంద్రాన్ని జమ్మూ కాశ్మీర్ లో నెలకొల్పుతామని అన్నారు. అక్టోబర్ నుంచి దీనికి సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు. అదే నెల ఏర్పాటు కానున్న పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి తయారీ కేంద్రం పనులు ఆరంభం అవుతాయని సుభాష్ కపూర్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో కొత్తగా నెలకొల్పబోయే తయారీ కేంద్రంలో రోజూ 44,500 హెల్మెట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు.
తొలి సంస్థ స్టీల్ బర్డ్..
ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తరువాత ఆ రాష్ట్రంలో ఏర్పాటు కానున్న మొట్టమొదటి పరిశ్రమ స్టీల్ బర్డ్ దే అవుతుంది. జమ్మూ కాశ్మీర్ కు ఆనుకునే ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండటం వల్లే ఇది సాధ్యపడింది. ఇక తాజాగా- జమ్మూ కాశ్మీర్ లో పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెట్టుబడులు పెట్టడంపై ఇప్పటిదాకా ఉన్న ఆంక్షలను ఎత్తేయడం వల్ల ఇక ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న పరిశ్రమలన్నీ తమ అదనపు తయారీ కేంద్రాలను జమ్మూ కాశ్మీర్ కు విస్తరించుకుంటామని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.