ఐడియా చెప్పండి.. రూ.10లక్షలు గెలుచుకోండి: రైల్వే బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. రైల్వే ఆదాయాన్ని పెంచడానికి మీ వద్ద సలహాలు ఏమైనా ఉంటే స్వీకరిస్తామంటోంది. ఇందుకోసం రూ.10లక్షల పారితోషికాన్ని కూడా ప్రకటించడం విశేషం.
ఆసక్తిగలవారు, రైల్వే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే సలహా ఇవ్వదలిచినవారు తమను సంప్రదించమంటూ ఆహ్వానిస్తోంది. ఇందుకోసం https://innovate.mygov.in/jan-bhagidari అనే వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎవరైనా సరే తమ విలువైన సలహాలు-సూచనలు రైల్వేకు ప్రతిపాదించవచ్చు.
అయితే నిబంధనల ప్రకారం.. ఏ ప్రతిపాదన అయినా సరే 1000పదాలకు మించరాదు. అధికారులు చెబుతున్న ప్రకారం.. రైల్వే శాఖలో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువే అయిపోయాయి. కాబట్టి రైల్వే ఆదాయాన్ని మెరుగుపెరిచే ఐడియాలు ఉంటే చెప్పండని ఆ శాఖ ప్రజల నుంచి సలహాలు కోరుతోంది.
2018, మే 19 దీనికి చివరి తేదీగా నిర్ణయించారు. కాగా, రైల్వేకు పంపించే ప్రతిపాదనలు పూర్తి బిజినెస్ ప్లాన్గా ఉండాలని చెబుతున్నారు. ఉత్తమమైన ప్రతిపాదన కోసం మొత్తం మూడు దశల్లోపోటీ ఉంటుందని చెబుతున్నారు.