ఆర్టిస్ట్ హేమ హత్య: చాలాసార్లు డబ్బిచ్చానన్న భర్త
ముంబై: ఆర్టిస్ట్ హేమ ఉపాధ్యాయతో తనకు ఎలాంటి వివాదాలు లేవని, ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తున్నానని ఆమె భర్త చింతన్ ఉపాధ్యాయ పోలీసుల విచారణలో చెప్పాడు. తమ మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలను కూడా పరిష్కరించనున్నట్లు చెప్పాడు.
హేమ ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది భంబానీలు ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. గతంలో చింతన్తో విభేదాల కారణంగా హేమ విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ కేసు నడుస్తుండగానే ఆమె హత్యకు గురయింది. కేసులో కీలక నిందితులను అరెస్టు చేసిన పోలీసులు హేమ భర్త చింతన్ను విచారించారు.
విడాకులకు దరఖాస్తు చేసినప్పుడు ఓ ప్లాట్ విషయంలో తమ మధ్య విభేదాలు ఉండేవని, ఈ ప్లాట్ కావాలని హేమ పలుమార్లు అడిగిందని, తాను ఎప్పుడూ తిరస్కరించలేదన్నాడు. ఈ ప్లాట్ అమ్మి డబ్బును చెరిసగం పంచుకుందామని చెప్పానని, నేను ఢిల్లీలో ఉన్నా.. ముంబై వచ్చినప్పుడు హేమ ఇంట్లోనే ఉండేవాడినన్నాడు.
తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని చెప్పాడు. చాలాసార్లు ఆమె డబ్బు అడిగిందని, తాను సాయం చేశానని చెప్పాడు. హేమ అదృశ్యమైన రోజు కూడా నేను రూ.2 లక్షలను భరణం కింద ఇచ్చానని చెప్పాడు. కాగా, ఇటీవల ఆర్టిస్ట్ హేమ, ఆమె లాయర్ మృతి సంచలనం రేపిన విషయం తెలిసిందే.