బీజేపీ ఎంపీ హేమామాలినికి పెద్ద ప్రమాదం తప్పింది
మధుర: భారతీయ జనతా పార్టీ ఎంపీ, ప్రముఖ సినీ నటి హేమామాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం తన నియోజకవర్గమైన మధుర ప్రాంతంలోని మిథౌలీ గ్రామంలో ఓ సమావేశానికి కాన్వాయ్లో వెళ్తుండగా భారీ ఈదురుగాలులు వీచాయి.
దీంతో ఓ చెట్టు విరిగి హేమామాలిని ప్రయాణిస్తున్న కారు ముందు పడింది. ఒక్క క్షణం ముందు వచ్చినా ఆ చెట్టు ఆమె కారుపై పడి పెద్ద ప్రమాదమే జరిగివుండేదని అధికారులు చెబుతున్నారు. కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం తప్పిందని తెలిపారు.
కాగా, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఈదురుగాలులు అతలాకుతలం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో వర్షాల కారణంగా 46మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా మరికొన్ని రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.